నారా చంద్రబాబు నాయుడు, లోకేష్లు అంతే. ఏదీ కూడా మనసులో దాచుకోలేరు. పైకి ఎన్ని అబద్ధాలు చెప్పినా అసలు విషయాలు మాత్రం ఇట్టే చెప్పేస్తూ ఉంటారు. కుల పిచ్చి, మతపిచ్చి, డబ్బు పిచ్చి……..ఇలా అన్నిరకాల పిచ్చీ ఉన్న దుర్మార్గ పార్టీ టిడిపి అని ఆ మధ్య లోకేష్ సెలవిచ్చారు. టిడిపి కార్యకర్తలందరిచేతా అదే మాట అనిపించారు. భారతదేశాన్ని అవినీతి భారతదేశంగా మార్చేవరకూ నిద్రపోనని చంద్రబాబు అన్నారు. భారతదేశ ప్రధానిగా అవకాశం రాలేదు కాబట్టి బాబుకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. కానీ అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందిగా………అందుకే ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలోనే అత్యంత ఎక్కువ అవినీతి రాష్ట్రంగా చరిత్ర పుటల్లోకి ఎక్కించేశాడు. అది కూడా చాలా చాలా తక్కువ కాలంలోనే.
ఆ విషయం పక్కనపెడితే 2014లో రాష్ట్ర విభజన సమయం నుంచీ ఇప్పటి వరకూ కూడా ఆంధ్రప్రదేశ్కి తీవ్ర ద్రోహం చేసిన టిడిపికి డిపాజిట్లు కూడా రావని తాజాగా చంద్రబాబు ఒప్పేసుకున్నాడు. ద్రోహులకు డిపాజిట్లు కూడా రావు అని చెప్పే సందర్భంలో పొరపడ్డాడు. అయినా 2014 నుంచి ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ద్రోహం చేసిన పార్టీలలో టిడిపిని మించి ఎవరున్నారు? చంద్రబాబు కంటే ఎవరు ఎక్కువ ద్రోహం చేశారు? విభజన పాపంలో సమాన భాగం ఉన్న బిజెపిని 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన రుద్దింది చంద్రబాబు, ఆయన భజన మీడియా కాదా? మోడీ ఇచ్చిన హామీలను తీసుకురాలేకపోయాడు, చేతకాని మాటలు చెప్పాడు, పోలవరాన్ని అటూ ఇటూ కాకుండా చేశాడు, ప్రత్యేక హోదా అవసరం లేదన్నాడు, రైల్వే జోన్ని విజయవాడకు తీసుకురావాలన్న ప్రయత్నంలో మొత్తానికి మోసం జరిగేలా చేశాడు. ఇక తాను ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల తలపై శఠగోపం పెట్టేశాడు. విభజన సమంయలో కూడా బాబువి ఇవే నాటకాలు. టిడిపి ఎంపి శివప్రసాద్తో సహా ఇతర సీమాంధ్ర ఎంపిలవి ఇవే వేషాలు. మొత్తంగా చూస్తే 2014లో విభజన సమయం నాటి నుంచీ ఇప్పటి వరకూ కూడా ఆంధ్రప్రదేశ్కి తీవ్ర ద్రోహం చేసింది టిడిపి, చంద్రబాబులేనని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. అందుకే చంద్రబాబు కూడా 2019 ఎన్నికలకు చాలా ముందుగానే ఫిక్సయినట్టున్నాడు. టిడిపి పని అయిపోయినట్టేనని……. చేసుకున్నోడికి చేసుకున్నంత అంటే ఇదేనేమో. 2014లో ప్రజలు దారుణంగా మోసం చేసి, వంచించి అయినా అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు……. అప్పుడు విజయవంతం అయినప్పటికీ ఇప్పుడు మాత్రం దానికి ఫలితం అనుభవిస్తున్నాడనడంలో సందేహం లేదు.
