ఉద్యోగం, ఉపాధి అంశాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్పై సచివాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి కోసం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ. యూనివర్సిటీ పరిధిలో 25 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు ఏర్పాటు చేయాలన్నారు.
నైపుణ్యాభివృద్ధి కోసం పాఠ్య ప్రణాళికలో మార్పులు, శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మారుతున్న టెక్నాలజీకి అవసరమైన పరిజ్ఞానంపై శిక్షణ యూనివర్సిటీ బాధ్యతలు తీసుకోవాలన్నారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగం, ఉపాధి పొందాలన్నదే టార్గెట్. ఐటీఐ, పాలిటెక్నిక్, బీకామ్ సహా డిగ్రీ కోర్సులు, ఇంజనీరింగ్ విద్యార్థులకు అదనంగా ఏడాది పాటు అప్రంటీస్. అప్రంటీస్ చేశాక, ఇంకా శిక్షణ అవసరమనుకుంటే మళ్లీ నేర్పించాలని సూచించారు. ఆ తర్వాతే పరీక్షలు నిర్వహించాలని, నెల రోజుల్లో కార్యాచరణకు సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.
పాఠ్య ప్రణాళికలో తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులపై నెల రోజుల్లో ప్రణాళిక సిద్ధం కావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో స్కిల్ డెవలప్మెంట్, ఉపాధి శిక్షణ కార్యక్రమాలపై విడివిడిగా నిధులు ఖర్చు చేయడాన్ని నిలిపివేయాలన్నారు. నిధుల వినియోగ బాధ్యతలను ఆర్థిక శాఖకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.