అగ్రకథానాయకుడు మోహన్లాల్ మరోసారి ఏనుగు దంతాల కేసులో చిక్కుకున్నారు. వన్యప్రాణుల దంతాలు, కొమ్ములతో చేసిన వస్తువులను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఆయన ఇప్పటికే విచారణ ఎదుర్కొంటుండగా.. తాజాగా అటవీ శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన వద్ద ఉన్న విగ్రహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
గతంలో తన వద్ద నాలుగు ఏనుగు దంతాలు ఉన్నట్లు మోహన్లాల్ ప్రకటించారు. అయితే తాజాగా మరో ఆరు దంతాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. వీటితో పాటు ఏనుగు దంతాలతో చేసిన 13 విగ్రహాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయన అంగీకరించారు. కేరళ అటవీ శాఖ అమలు చేసిన క్షమాభిక్ష పథకంలో భాగంగా మోహన్లాల్ ఈ తాజా ప్రకటన చేశారు.
తన వద్ద ఉన్న ఈ దంతాలు, విగ్రహాలు చాలా వరకు వారసత్వంగా వచ్చినవి లేదా తనకు లభించిన బహుమతులని ఆయన స్పష్టం చేశారు. మోహన్లాల్ ప్రకటించిన విగ్రహాలలో కృష్ణుడు, రాముడు, బాలాజీ రూపాలు ఉన్నాయి. వీటి మొత్తం బరువు సుమారు 46 కిలోలు ఉంటుందని అటవీ శాఖ అధికారులు లెక్కించారు. ఇప్పుడు ఈ వస్తువులు నిజంగా ఏనుగు దంతాలతోనే తయారు చేశారా లేదా అనే విషయాన్ని నిర్ధారించడానికి శాస్త్రీయ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ కేసుపై ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఏనుగు దంతాలను కలిగి ఉండటం నేరం. ఈ నేపథ్యంలోనే అధికారులు డీఎన్ఏ పరీక్షల ద్వారా నిజాన్ని తేల్చాలని నిర్ణయించారు. తన వద్ద ఉన్న వస్తువుల వివరాలను స్వయంగా వెల్లడించిన మోహన్లాల్కు ఈ పరీక్షల ఫలితాలు ఎలాంటి మలుపును ఇస్తాయోనన్న ఆసక్తి నెలకొంది.
