మాలో నిధుల గోల్మాల్పై సభ్యుల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ఉదయం మా అధ్యక్షుడు శివాజీ రాజా, శ్రీకాంత్ పెట్టిన ప్రెస్ మీట్లో తాను ఒక్క పైసా దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తే, తన ఆస్తి మొత్తాన్నీ పరిశ్రమకు రాసిచ్చేస్తానని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా సవాల్ విసరడంపై ఆ అసోసియేషన్ కార్యదర్శి, సీనియర్ నటుడు నరేశ్ స్పందించారు.
మా’ లో నిధుల దుర్వినియోగం జరిగింది వాస్తమేనన్నారు. ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించినందు వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. తనపై వచ్చిన ఆరోపణలకు శివాజీరాజా సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘మా’ అధ్యక్షుడు ప్రవర్తిసున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నరేశ్.. తాను అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానని తెలిపారు.
శివాజీరాజా నిర్ణయాలు ఆశ్చర్యం కలిగించాయని, తనతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. ‘నువ్వూ సంతకం పెట్టావు..నువ్వు తినే ఉంటావు’ అని తనను అన్నారని, శివాజీరాజాపై నమ్మకంతో ఒప్పందాలపై సంతకం చేశానని, అన్నారు.
రజతోత్సవాలకు సంబంధించి జనరల్ సెక్రటరీగా తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, అమెరికాలో ‘మా’ సిల్వర్ జూబ్లీ వేడుకలకు హాజరయ్యేందుకు చాలా మంది బిజినెస్ క్లాస్ లో ప్రయాణించారని, ఒక్కో టికెట్టు కు రూ.3 లక్షలు ఖర్చు చేశారని, ఎవరికి ఏ టికెట్ ఇవ్వాలన్నది కార్యదర్శి నిర్ణయించాలని అన్నారు.
మా’ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న తనకు శివాజీరాజా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని నరేశ్ ఆరోపించారు. ఏప్రిల్ నుంచి శివాజీరాజా తన ఫోన్ కట్ చేసాడంటూ… ఆయనకు సంబంధించిన కాల్, మెసేజ్ డాటాను బయటపెట్టారు. నిజాలు నిర్భయంగా మాట్లాడుతాను కాబట్టే తనను దూరం పెడుతున్నారని ఆరోపించారు. మాలో చోటుచేసుకున్న ఈ వివాదంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారితో నిజనిర్ధాణ కమిటీ వేయాలని తాను చెప్పానని.. అయితే శివాజీరాజా మాత్రం అందుకు అంగీకరించడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి కూడా తీసుకువెళ్లానన్నారు.
చిరంజీవి అభినందించేందుకు వెళ్లిన సందర్భంలో, అప్పుడే ఈ విషయాలు ఆయనకు వివరించానని, కొంత సమయం తీసుకుని పెద్దలతో చర్చిస్తానని చిరంజీవి తనతో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. నిధులు దుర్వినియోగం జరిగాయని తాను అనడం లేదని, ఆరోపణలు వస్తున్నాయి కనుక, కమిటీ వేసి నిజానిజాలు తేల్చాలని అన్నారు.