వివాదాస్పద చిత్రం పద్మావత్ సినిమా విడుదలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇబ్బందులు తొలగలేదు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈనెల 25 న దేశ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవతున్న సమయంలో ఇప్పుడు రాజ్పుత్ వర్గంనుంచి మరో షాక్ తగిలింది.
పద్మావత్ సినిమా విడుదలైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రాజ్పుత్ గ్రూపులు గురువారం మరోమారు హెచ్చరించాయి. సినిమాను దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసిన కొద్దిసేపటికే రాజ్పుత్ గ్రూపులు ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం.
తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ సినిమాను విడుదల చేస్తే ఊరుకోబోమని హెచ్చరించాయి. తమ విన్నతులను పట్టించుకోకుండా ఆ సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగులబెడతామని ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నామని ఆయా సంఘాల ప్రతినిధులు అన్నారు. ఈ సినిమాను నిషేధించాల్సిందేనని డిమాండ్ చేశారు.
రాణి పద్మావతి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తీశారని రాజ్పుత్లు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను బీజేపీ పాలిత రాష్ట్రాలు కొన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించగా సుప్రీంకోర్టు మాత్రం ఈ సినిమా విడుదలకు అనుమతినిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ రాజ్పుత్లు ఆందోళనకు దిగుతామని హెచ్చరించడంతో మరోసారి ఉత్కంఠ నెలకొంది.