సిజెపి (CJP) నిరసనకారులపై పోలీసు చర్యలకు సంబంధించిన తాజా పరిణామాలపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్య కాంత్ బుధవారం స్పందించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి నిరసనకారులపై పోలీసులు తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా.. పిటిషనర్ కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని స్పష్టం చేశారు. మా సమయాన్ని వృథా చేయకండి అని విచారణ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
పోలీసుల అతిక్రమణలను నిరూపించే వీడియోలు అందుబాటులో ఉన్నాయని లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. మాకు ఆ వీడియోలపై ఎలాంటి ఆసక్తి లేదు. వీడియోలను కూర్చుని చూసే సమయం మా వద్ద లేదు అని ప్రధాన న్యాయమూర్తి తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఢిల్లీలో జరిగిన ఈ నిరసనల సమయంలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యలపై దాఖలైన పిటిషన్ను అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
నీట్ (NEET) పరీక్షను పారదర్శకంగా నిర్వహించడం…నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) లో సంస్కరణలు తేవడం వంటి అత్యంత ముఖ్యమైన సమస్యలపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని న్యాయవాది వాదించారు. దానికి బదులుగా సీజేఐ స్పందిస్తూ.. థాంక్యూ వెరీ మచ్ (చాలా ధన్యవాదాలు) అని సదరు వాదనను ముగించారు.
