అవినీతి కేసులు టీడీపీ అధినేత చంద్రబాబును వదలడం లేదు. ఇప్పటికే పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటుండగా తాజాగా ఏపీ ఫైబర్ నెట్ కేసులో చార్జీషిట్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. ఈ చార్జిషీట్ లో ఏ1గా చంద్రబాబు, ఏ2 వేమూరి హరికృష్ణ, ఏ3గా కోకంటి సాంబశివరావును పేర్కొంది.
నిబంధనలకు విరుద్ధంగా వేమూరి హరికృష్ణకు చెందిన టెరా సాప్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టారని స్పష్టం చేసింది. మొత్తం 2వేల కోట్ల ఈ ప్రాజెక్టు కింద మొదటి దశలో 333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలు జరిగాయని వెల్లడించింది.
టెండర్ల కేటాయింపు నుంచి ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు అనేక అవకతవకలు జరిగినట్లు ఛార్జిషీట్ లో పేర్కొంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం ఏర్పడిందని వెల్లడించింది. ఫైబర్ నెట్ ఒప్పందాన్ని అమలుచేసే సమయంలో జరిగిన ఉల్లంఘనలతో ప్రభుత్వానికి దాదాపు 114కోట్ల మేర నష్టం వాటిల్లినట్లుగా తేల్చింది. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ సీఐడీ దాఖలు చేసిన ఛార్జీషీట్ చర్చనీయాంశంగా మారింది.