ఏపీలో ఎన్నికల హీట్ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. వైసీపీని ఎదుర్కొనేందుకు పొత్తు అస్త్రాన్ని ఎంచుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పవన్ జనసేనతో ఇప్పటికే పొత్తు ఖరారు కాగా ఈ కూటమిలో బీజేపీ చేరుతుందనే ఆశతో ఉన్నారు బాబు. అయితే తాజాగా కమలం పార్టీ నేతల నుండి అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సింగిల్గా పోటీ చేసేందుకు కమలనాథులు మొగ్గుచూపతున్నారట.
ఇందులో భాగంగా ప్రజల ముందుకు వచ్చేందుకు వైసీపీ – టీడీపీ,జనసేన కూటమి మధ్య జరుగుతున్న కాపు వార్నే ఎంచుకుందట బీజేపీ. తమను గెలిపిస్తే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించే ఆలోచన చేస్తోందట బీజేపీ. ఒకవేళ ఇదే జరిగితే టీడీపీ – జనసేన కూటమికి గట్టిదెబ్బే. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ – జనసేన కూటమి గెలిస్తే చంద్రబాబే సీఎం అవుతారని తేల్చి చెప్పారు లోకేష్.
దీంతో కాపు సామాజికవర్గానికి చెందిన పవన్..తాను సీఎం అవుతానని చెప్పిన మాటలన్ని ఉత్తవేనని తేలిపోయాయి. ఈ నేపథ్యంలో బీజేపీ కాపు సీఎం అని ప్రకటిస్తే ఓట్లు ఖచ్చితంగా చీలి అది తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. అందుకే 175 సీట్లలో కాపు సీఎం అనే నినాదం రావాలని భావిస్తుండటంతో బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు టీడీపీ – జనసేన వర్గాలకు మింగుడు పడటం లేదు. ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో తెలియదు కాబట్టి బీజేపీ నిజంగానే కాపు సీఎం నినాదంతో వస్తుందో లేదో వేచిచూడాలి.