ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న కార్యక్రమం కులగణన. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి క్షేత్ర స్థాయిలో అవగాహన సదస్సులు జరుపుతూ అభిప్రాయ సేకరణ చేపట్టారు. వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని ఈ నెల 27 నుండి ప్రారంభించాలనుకున్న అది కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏపీలో దాదాపు 130కి పైగా బీసీ కులాలు ఉన్నట్లు అంచనా వేస్తోంది జగన్ సర్కార్. సమగ్ర కుల గణణ ద్వారా బీసీలకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇప్పటికే బిహార్లో కులగణన పూర్తి కాగా అక్కడ బీసీలకు 65 శాతం రిజర్వేషన్లు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఇక్కడ కూడా అలాంటి ప్రయత్నమే చేస్తారనే టాక్ నడుస్తోంది. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విపక్ష బీసీ నేతలకు సైతం అవగాహన సదస్సులకు ఆహ్వానిస్తున్నారు. అయితే వారు మాత్రం హాజరుకావడం లేదు.
ఇక జగన్ చేపట్టిన కులగణన వెనుక భారీ స్కెచ్ ఉంది. ఏపీలో అధికారంలోకి ఎవరు వస్తారనేది డిసైడ్ చేసేది బీసీల ఓట్లే. అందుకే వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన జగన్..బీసీ ఓటు బ్యాంకుతో మరోసారి అధికారంలోకి వచ్చేలా కార్యక్రమాల రూపకల్పన చేపట్టనున్నారని సమాచారం. ఇక బీసీల కులగణన ప్రజల కల. దానిని జగన్ నెరవేరుస్తుండగా ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక కులగణన చేపడితే వైసీపీతో పాటు టీడీపీ సైతం ప్రజాకర్షక పథకాలను ప్రకటించే ఛాన్స్ ఉంది. అయితే ఇది వైసీపీకే ప్లస్ కానుంది. ఇప్పటికే మొత్తం 56 కార్పొరేషన్ల ద్వారా బీసీలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని వైసీపీ చెబుతోంది. రాజకీయ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం బీసీ కులగణన జగన్ ను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి దోహద పడుతుందని తెలుస్తోంది.
