ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో అందించే నివేదిక వారి పనితీరుకు నిలువుటద్దమని స్పష్టం చేశారు. మొత్తం తొమ్మిది పారామీటర్ల ఆధారంగా సర్వే నిర్వహించి నివేదికలను అందిస్తున్నామని తెలిపారు. అయితే వారికి తెలియని మరికొన్ని పారామీటర్లు కూడా తన వద్ద ఉన్నాయని హెచ్చరించారు. తాను గతంలో ఉన్నట్లే నిక్కచ్చిగా ఉంటానని, మార్పు లేకపోతే నష్టం వారికి తప్పదని స్పష్టం చేశారు.
లోకేష్ తన పని తాను చేసుకుంటున్నాడని, తాను తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని సీఎం పేర్కొన్నారు. నేతలతో మానవీయ సంబంధం ఉండాలని, అయితే అవసరమైన చోట మోటివేషన్ భయం-భక్తి మిశ్రమంగా ఉండాలని వ్యాఖ్యానించారు.
మంగళగిరి చీరలకు నారా లోకేష్ మంచి బ్రాండింగ్ కల్పిస్తున్నారని ప్రశంసించారు. మహిళా సభ్యులు ఒకే రకమైన చీరలతో సభకు హాజరవడం వారి ఐక్యతకు నిదర్శనమని అన్నారు. పార్టీ బలోపేతానికి క్రమశిక్షణ, సమన్వయం, ప్రజలతో అనుసంధానం కీలకమని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
