ఇటీవల ఆంద్రప్రదేశ్ లో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోడి హాజరయ్యారు. ప్రధాని రాకకు రాష్ట్ర సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఘన స్వాగతం పలికారు. ఆయితే ఎవరు ఊహించని విధంగా ఆ సభలో చిరంజీవి కూడ ప్రత్యక్షమయ్యారు. ప్రస్తుతం ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం చిరు సినిమాలపై దృష్టి కేంద్రీకరిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక పోలిటికల్ సభలో చిరు దర్శనమివ్వడం కొత్త చర్చలకు తావిస్తోంది. అదికూడా అధికార పార్టీ అయిన వైసీపీ నిర్వహించిన సభ కావడం, ఈ సభకు ప్రధాని మోడి హాజరు కావడం, కనీసం ప్రోటోకాల్ పరంగా కూడా జనసేన అద్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరు కాకపోవడం.. ఇదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి హాజరు కావడం, ఇవన్నీ కూడా మరొకసారి చిరు వర్సస్ పవన్ అనే టాపిక్ ను తెరపైకి తెచ్చాయి.
ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో పవన్ యాక్టివ్ గా ఉన్నాడు. జనసేన పార్టీ అద్యక్షుడిగా రాబోయే ఎన్నికలే టార్గెట్ గా పవన్ రాజకీయాల్లో దూసుకుపోతున్నాడు. అయితే చిరు ఇంతవరకు జనసేన పార్టీ తరుపున ఎప్పుడు కూడా నోరు విప్పలేదు. కానీ జనసేనకు ఏమాత్రం సంబంధంలేని సభకు చిరు హాజరు కావడంతో చిరు మళ్ళీ రాజకీయ రంగప్రవేశం చెయ్యబోతున్నారా? అనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. అయితే విగ్రహావిష్కరణ సభకు పవన్ హాజరు కాకపోవడానికి ఇంటర్నల్ గా కొన్ని ఉన్నాయి అని చెప్తున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా పవన్ అధికార పార్టీ పైన, సిఎం జగన్మోహన్ రెడ్డి పైన మొదటి నుంచి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు..దాంతో సిఎం జగన్ అద్యక్షతన జరిగే విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చినప్పటికి పవన్ రాలేదనేది ఒక వాదన, మరో వాదన ఏమిటంటే .. జనసేన బీజేపీతో రహస్య పొత్తులో ఉంది అనే వార్తలు ఆ మద్య బాగానే వినిపించాయి.
అయితే ఈ వార్తలను ఖండిస్తూ పవన్.. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేవంటూ, సింగిల్ గానే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నట్లు చాలా సార్లు స్పష్టం చేశాడు. ఇలాంటి సమయంలో ప్రధాని వచ్చిన విగ్రహావిష్కరణ సభకు పవన్ వస్తే బీజేపీతో జనసేన పొత్తు అనే వార్తలు మరింత బలపడతాయి. అందువల్ల అలాంటి వార్తలకు చోటివ్వకుండా, పవన్ విగ్రహావిష్కరణ సభకు రాలేదని ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి చిరు ప్రధాని మోడి రాకను స్వాగతిస్తూ మర్యాద పూర్వకంగా విగ్రహావిష్కరణ సభకు హాజరైనప్పటికి, చిరు రావడం, పవన్ రాకపోవడం.. అనేదే మెయిన్ హాట్ టాపిక్ గా మారింది. ఒక వేళ చిరు మళ్ళీ రాజకీయ రంగప్రవేశం చేస్తే.. తమ్ముడి పార్టీ కాకుండా వేరే పార్టీలో చేరితే.. చిరు, పవన్ ల మద్య విభేదాలు ఉన్నాయనే వార్తలు మరింత బలపడతాయి. ఆ మద్య సినిమా టికెట్ ధరల విషయంలో కూడా పవన్ ప్రభుత్వం పై తీవ్రంగా విరుచుకుపడితే, చిరు మాత్రం సానుకూలంగా సిఎం జగన్ ను కలిసి మంతనాలు చేశారు. ఇది కూడా అప్పుడు చిరు వర్సస్ పవన్ అనే టాపిక్ తెరపైకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రధాని మోడి రాక వల్ల చిరు వర్సస్ పవన్ అనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి రూమర్స్ కి అటు మెగాస్టార్ చిరంజీవి గాని, ఇటు జనసేనాని పవన్ కల్యాణ్ గాని ఎలా చెక్ పెడతారో చూడాలి.