ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్వి ఉత్తర కుమార ప్రగల్భాలని సవాల్ చేసి పారిపోవడం ఆయనకే చెల్లిందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. నాలుగు గోడల మధ్య కూర్చుని మాట్లాడటం నిజంగా సిగ్గుచేటని మండిపడ్డారు.
డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగినందునే భయంతో సీబీఐ విచారణకు ఆదేశించడం లేదని ఆయన ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన పుత్తా శివశంకర్.. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేశారని కానీ ఎన్డీయే కూటమిలో భాగమైన టీడీపీ మంత్రి లోకేష్ డీఎస్సీ అక్రమాలపై ఎందుకు రాజీనామా చేయడం లేదని ప్రశ్నించారు.
నారా లోకేష్ వ్యవహార శైలిపై విసిగిపోయిన ‘జెన్ జీ’ (యువత) పెద్ద ఎత్తున ఆగ్రహంతో ఉందన్నారు. ఈరోజు తమ పార్టీ నిర్వహించిన నిరసనల్లో యువత విశేషంగా పాల్గొనడంతో కూటమి నేతలకు మైండ్ బ్లాంక్ అయిందని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలపై వైఎస్ జగన్ ఆధారాలతో సహా ప్రశ్నలు లేవనెత్తితే….నారా లోకేష్ సరైన సమాధానం చెప్పలేక తోక ముడిచారని విమర్శించారు.
వైఎస్ జగన్కు ఛాలెంజ్ చేసే స్థాయి లోకేష్కి లేదని, ఆయనతో చర్చించడానికి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధులు చాలని వ్యాఖ్యానించారు. చర్చకు రావాలి లేదా రాజీనామా చేయాలి…గతంలో పేర్ని నాని ఇచ్చిన ఓపెన్ ఛాలెంజ్పై స్పందించకుండా లోకేష్ పారిపోయారని ఇప్పటికైనా ధైర్యం ఉంటే చర్చకు రావాలని లేదంటే డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయాలని పుత్తా శివశంకర్ డిమాండ్ చేశారు.
