వాస్తవానికి రాజకీయాల్లో ఇప్పటివరకు పెండింగ్ అంటే గుర్తుకొచ్చేది…పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, పథకాల నిధులు. కానీ ఇప్పుడు పెండింగ్ అంటే టీడీపీ – బీజేపీ పొత్తే గుర్తుకొస్తుంది. ఎందుకంటే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం,బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ కావడంతో టీడీపీ – బీజేపీ పొత్తు దాదాపు ఖరారైందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత అమిత్ షా ప్రకటన సైతం ఏపీ నుండి త్వరలో ఓ పార్టీ ఎన్డీయే చేరనుందని ప్రకటించారు కూడా. ఇక ఈ పొత్తు బాధ్యత, సీట్ల సంఖ్య ఖరారు బాధ్యతను జనసేన అధినేత పవన్ భుజాన పెట్టారు చంద్రబాబు.
దీంతో పవన్ ఢిల్లీకి వెళ్లడమే తరువాయి అనుకున్నారు అంతా. కానీ ఢిల్లీ పెద్దల నుండి పవన్కు ఎలాంటి సమాచారం కానీ, అపాయింట్మెంట్ కానీ దొరకడంలేదు. దీంతో టీడీపీ – జనసేన నేతల నుండి తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. ఈ రెండు పార్టీ సీట్ల సంఖ్య ఖరారు ప్రకటనే తరువాయి అనుకుంటున్న తరుణంలో బీజేపీ ఎంటరవడంతో బ్రేక్ పడింది.
ఇక పవన్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత ప్రకటన ఉంటుందని భావిస్తుండగా ఆయన షెడ్యూల్ మాత్రం ఖరారు కావడం లేదు. ఒకవేళ పవన్ ఢిల్లీ టూర్ ఖరారైన బీజేపీ కోరిన విధంగా సీట్లు ఇవ్వకుంటే కథ మళ్లీ మొదటికే వస్తుంది. దీనికి తోడు టీడీపీ, జనసేన మధ్య కొన్ని నియోజకవర్గాల్లో యుద్దం కూడా మొదలైంది. సీటు తమకేనంటే తమకేనని రెండు పార్టీల నేతలు బలప్రదర్శనకు సైతం దిగుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ వస్తే సీటు ఎవరికోననే కొత్త టెన్షన్ కూడా మొదలైంది. మొత్తంగా బీజేపీ ఎంట్రీతో టీడీపీ – జనసేన మధ్య పొత్తు మొదటికి రావడాన్ని ఈ రెండు పార్టీల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.