రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ప్రజా ఉద్యమాలకు పిలుపునిచ్చింది. ఈ నెల 12వ తేదీన రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మాజీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు కక్ష కట్టడం సరికాదు అన్నారు.
ఈనెల 12న వైయస్సార్సీపీ ప్రజా ఉద్యమం పేరుతో 175 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. అనంతరం అధికారులకు వినతిపత్రాలు అందజేయడం జరుగుతుందని వివరించారు.
అందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించిన నాటి సీఎం వైయస్ జగన్, రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టడమే కాకుండా వైయస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 7 కాలేజీలను పూర్తి చేశారు. మిగిలిన కాలేజీల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల నిర్మాణాలకు నిధుల కొరత లేకుండా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ తో టైఅప్ చేయడం జరిగింది. కానీ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ నిర్మాణాలను పూర్తిచేయకపోగా సేఫ్ క్లోజర్ పేరుతో పూర్తిగా పక్కన పెట్టేశారు అన్నారు.
అంతేకాకుండా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించి డాక్టర్లు కావాలని కలలు కనే పేద విద్యార్థుల ఆశలకు చంద్రబాబు గండి కొట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పరిధిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అన్నారు.
