వచ్చే ఏడాది సమ్మర్ చాలా హీటెక్కనుంది. ఎండలతోనే కాదు.. బాక్సాఫీసు పోరాటాలతో కూడా వేడి పెరుగుతుంది. అందులోనూ మామూలుగా కాదు.. ఏకంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రిన్స్ మహేశ్ బాబుల సినిమా ఒకే రోజు రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టాలీవుడ్ లో టాప్ స్టేటస్ లో ఉన్న ఆ హీరోలిద్దరి సినిమాలూ ఒకే రోజు విడుదల అయితే అంత కన్నా విశేషం లేదనుకోవాలి. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే.. ఏప్రిల్ ఎనిమిదో తేదీన మహేశ్ బ్రహ్మోత్సవం, పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ విడుదల అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఫిబ్రవరి కల్లా బ్రహ్మోత్సవం షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం. ఆ తర్వాత అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకుని ఏప్రిల్ ఎనిమిదో తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఇక బ్రహ్మోత్సవం కన్నా ముందే షూటింగ్ మొదలైన సర్ధార్ గబ్బర్ సింగ్ షూటింగ్ కూడా ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమా కూడా ఏప్రిల్ రెండోవారం ఆరంభంలోనే విడుదల అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలూ ఒకే రోజు విడుదల అయ్యే అవకాశాలున్నాయి.