మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమాకి పూరి జగన్నాథ్ డైరెక్షన్ చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ పూరి చెప్పిన కథ చిరుకు నచ్చకపోవడంతో 150 వ చిత్రానికి వి.వి.వినాయక్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇదే విషయంపై పూరి మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
చిరంజీవితో ఆ సినిమా ఎందుకు మిస్సయ్యానో చెప్పేశాడు. భవిష్యత్తులో తన అభిమాన హీరో చిరుతో తప్పక సినిమా తీస్తానన్నాడు. చిరంజీవిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని కాన్ఫిడెంట్ గా చెప్పాడు పూరీ. తాను చిరంజీవి సినిమాలు చూస్తూ.. పెరిగానని.. చిరుకు పెద్ద అభిమానినని.. ఒక దర్శకుడిగా చిరంజీవిని ఎలా ప్రొజెక్ట్ చేయాలనే విషయంలో తనకు ఒక స్పష్టమైన విజన్ ఉందన్నాడు. మెగాస్టార్ స్ధాయికి తగ్గ సినిమానే తాను చేస్తానని చెప్పాడు. తాను చిరంజీవికి ‘ఆటో జానీ’ కథ వినిపించానని, ఆ కథ ఆయనకు బాగా నచ్చిందని తెలిపాడు. అయితే ఆయన ఆ మూవీ చేయకుండా కొంతమంది ప్రభావితం చేశారని చెప్పాడు. 3 నెలల క్రితం చిరంజీవికి మరో కథ వినిపించాననీ, ఈ కథ కూడా ఆయనకు బాగా నచ్చిందన్నాడు.
ఆ కథను పెట్టి చిరుతో తప్పకుండా సినిమా చేస్తానని చెప్పాడు. ‘సైరా నరసింహా రెడ్డి’ తరువాత బోయపాటి దర్శకత్వంలో చిరు నటించబోతున్నారు. ఆ సినిమా తర్వాత పూరీ సినిమా పట్టాలెక్కుతుందేమో చూడాలి. ప్రస్తుతం పైసా వసూల్ తో మరో ప్లాప్ ను మూటగట్టుకున్న పూరీకి చిరు ఛాన్స్ ఇస్తాడా ? లేదా? అన్నది చూడాలి.