పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి జమ్ముకశ్మీర్లోకి ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చొరబడినట్లు భద్రతా అధికారులకు సమాచారం అందింది. దీంతో జమ్ముకశ్మీర్తో పాటు దేశ రాజధాని దిల్లీ నగరంలో భద్రతా సిబ్బందిని అధికారులు అప్రమత్తం చేశారు. పాకిస్థాన్, జమ్ముకశ్మీర్ సరిహద్దులోని నియంత్రణ రేఖ దాటుకుని దాదాపు 20 మంది ముష్కరులు కశ్మీర్లోకి ప్రవేశించారని అధికారులు వెల్లడించారు.
వీరిలో ఎక్కువ మంది జైషేమహమ్మద్ సంస్థకు చెందిన వారని అధికారులు తెలిపారు. బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు సరిహద్దులో వాస్తవాధీన రేఖను దాటుకుని కశ్మీర్లోకి ప్రవేశించినట్టు నిఘా వర్గాలు వెల్లడించాయి. రంజాన్ నెల 17 వ రోజున బాదర్ యుద్దం (మహ్మద్ ప్రవక్త చేసిన తొలి పవిత్ర యుద్ధం) జరిగినట్టు ముస్లింలు పరిగణిస్తారు. దీని పేరుతో భారత్లో శనివారం నాడు దాడులకు పథకం రచించినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో జమ్మూకశ్మీర్తోపాటు ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీచేశారు.
సున్నితమైన ప్రాంతాల్లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉగ్రవాదులు దేశంలో చొరబడడం చాలా అరుదని అధికారులు వెల్లడించారు. వీరు కశ్మీర్లో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.