బిట్కాయిన్స్పై మోజుతో ట్రేడింగ్ చేస్తున్న ఇన్వెస్టర్లను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. బిట్కాయిన్ సహా వర్చువల్ కరెన్సీలో ట్రేడింగ్ చేసే వారు సొంతంగా రిస్క్ తీసుకోవాలని, దీనికి ఎలాంటి పూచీ ఉండదని స్పష్టం చేసింది. బిట్కాయిన్ ధర కేవలం స్పెక్యులేషన్పైనే ఆధారపడి ఉంటుందని, ఫలితంగా వీటి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది.
అయితే ప్రభుత్వం వారిస్తున్నప్పటికీ దేశంలో బిట్కాయిన్ బిజినెస్ బూమ్ పుంజుకుంటోంది. బిట్ కాయిన్ పేరుతో చిన్న చిన్న సంస్థల నుంచి పెద్ద పెద్ద వెబ్సైట్లు, యాప్లు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే `ప్లూటో ఎక్స్ఛేంజ్` పేరుతో దేశంలో తొలి బిట్కాయిన్ యాప్ అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా ఐపీ అడ్రస్ల ఆధారంగా పనిచేసే బిట్కాయిన్ లావాదేవీలను కేవలం మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే చేసుకునే సదుపాయాన్ని ఈ యాప్ కల్పించనుంది.
పది అంకెల మొబైల్ నెంబర్తో లావాదేవీలు చేయడానికి రక్షణగా నాలుగు అంకెల పిన్ను సృష్టించుకోవాలని ప్లూటో ఎక్స్ఛేంజ్ వ్యవస్థాపకుడు భరత్ వర్మ తెలిపారు. ఈ యాప్ ద్వారా బిట్కాయిన్లు కొనడం, అమ్మడం, ఖర్చు చేయడం, దాచుకోవడం వంటి సేవలను ఒక్క క్లిక్ ద్వారానే అందించనున్నట్లు భరత్ పేర్కొన్నారు.
