తమిళులు అమ్మ.. దివంగత నేత జయలలిత మరణించి రెండేళ్లయినా ఆమె బ్యాంక్ అకౌంట్ మాత్రం యాక్టివ్గానే ఉంది. అంతేకాదు ప్రతి నెల క్రమం తప్పకుండా అందులో డబ్బులు డిపాజిట్ అవుతూనే ఉన్నాయంట. ఈ విషయాన్ని ఐటీ శాఖ గుర్తించింది.
జయలలితకు సంబంధించి ఆస్తుల్లో నివాసం ఉండేవారే ఈ సొమ్మును జమ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. అమ్మ లేకున్నా ఆమెకు తాము చెల్లించాల్సిన మొత్తాల్ని మాత్రం ప్రతి నెలా క్రమం తప్పకుండా బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. ఆమె భవనాలలో నివసిస్తున్నవారు, దుకాణ యజమానులు, వ్యాపారులు ప్రతినెల అద్దెను ఆమె ఖాతాల్లో జమ చేస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు. వారి వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు.
ఇదిలా ఉంటే.. అమ్మ ఆస్తిపన్నులు చెల్లించని కారణంగా ఆదాయపన్ను శాఖ ఇటీవల ఆమెకు చెందిన నాలుగు స్థిరాస్తుల్ని అటాచ్ చేసింది. అమ్మ మరణించే నాటికి పన్నుల రూపంలో ఆమె చెల్లించాల్సిన మొత్తం రూ.20 కోట్లకు దాటినట్లుగా తెలుస్తోంది. ఆమె మరణం తర్వాత ఆమె అధికారిక వారసులు ఎవరన్న విషయంపై క్లారిటీ లేకపోవటంతో ఆమె ఆస్తులకు సంబంధించిన ఆస్తిపన్నును చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. దీంతో.. చట్టం తనపని తాను చేసుకుపోయే రీతిలో.. తమకున్న బకాయిలకు ఆస్తుల్ని అటాచ్ చేసుకుంటూ పోతున్నారు అధికారులు.
అమ్మ లేదు కాబట్టి ఆమె ఆస్తుల్ని అటాచ్ చేస్తున్నారు కానీ.. అదే అమ్మ ఉండి ఉంటే.. ఆమె బకాయిలు ఎన్ని వందల కోట్లు పెండింగ్ లో ఉన్నా.. అడిగే సాహసం చేసేవారా?