తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కొద్ది సేపటి క్రితం కరుణానిధికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ను వైద్యులు విడుదల చేశారు. కొన్ని గంటలుగా ఆయన అవయవాలు చికిత్సకు సహకరించడం లేదని తెలిపారు.
కరుణానిధికి చికిత్స అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని, వైద్య పరంగా తాము చేయగలిగింది చేస్తున్నామని పేర్కొన్నారు. కరుణకు అవసరమైన వైద్యం అందిస్తున్నా ఆయన ఆరోగ్యం మెరుగుపడటం లేదని తెలిపారు. దీంతో కావేరీ ఆసుపత్రి వద్దకు అభిమానులు, నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.
కరుణానిధి ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి తమ ప్రియతమ నేత ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందుతున్న అభిమానులు.. కావేరీ ఆస్పత్రి వెలుపల కరుణానిధి ఫొటోలను పట్టుకొని ఆయన కోసం కన్నీరు పెడుతూ ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకొని ఆస్పత్రి నుంచి బయటకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.
కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారిందని తాజా హెల్త్ బులెటిన్లో వైద్యులు ప్రకటించడంతో కావేరీ ఆస్పత్రికి అభిమానులు పెద్ద ఎత్తున్న చేరుకుంటున్నారు. దీంతో పోలీసులు ఆస్పత్రి వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. తమిళనాడు వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతకు పోలీసు శాఖను డీజీపీ అలర్ట్ చేశారు. దీంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, కరుణానిధి కుమారుడు స్టాలిన్.. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి నివాసానికి వెళ్లి చర్చలు జరపడం మరింత అనుమానాలకు తావిస్తోంది. కరుణానిధి పరిస్థితి గత రెండు రోజులుగా ఆందోళనకరంగా ఉండటం.. ఈ నేపథ్యంలో సీఎంతో స్టాలిన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.