కేరళలో కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. వరదలు ముంచెత్తడంతో కేరళ విలవిలలాడుతోంది. భారీ వరదలకు అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఏకంగా జల ప్రళయాన్నే తలపించిందికేరళ.సహజ సిద్ధమైన కొండలు, లోయలు ఎక్కువగా ఉండే కేరళలో ఇంత ఎక్కువ వర్షపాతం కురిసినంత మాత్రాన ఇంతటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాల్సిన అవసరం లేదు. కేరళ ప్రస్తుత పరిస్థితికి అక్రమ నిర్మాణాలు, భారీ ఎత్తున గనుల తవ్వకం లాంటి మానవ తప్పిదాలే కారణమని మాధవ్ గాడ్గిల్ వ్యాఖ్యానించారు
ఇదిలా ఉంటే ఇప్పడు కేరళ లాంటి జల ప్రలయాన్ని మరో రెండు రాష్ట్రాలు ఎదుర్కోబోతున్నాయనే పర్యావరణ వేత్తల మాటలు బెంబేలెత్తిస్తున్నాయి. మహారాష్ట్ర, గోవాల్లో కూడా కేరళ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ హెచ్చరించారు.పశ్చిమ కనుమల్లో పర్యావరణ పరిరక్షణపై 2011లో తాను సమర్పించిన నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకోకుంటే ఆ రెండు రాష్ట్రాలకు ముప్పు తప్పదన్నారు.
2014లో పుణే జిల్లా మలిన్ మాదిరిగా ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం లాంటివి తప్పవని గాడ్గిల్ హెచ్చరించారు. పర్యావరణ సమస్యలు ప్రతికూల ప్రభావం చూపుతాయని, ఆకస్మిక వరదలే కాకుండా ఇతర వైపరీత్యాలకు కారణమవుతాయని ఆయన అన్నారు. అయితే ఈ ప్రాంతాల్లో చేపడుతున్న నిర్మాణాల కారణంగా పర్యావరణ ముప్పు మాత్రం ఒకే విధంగా ఉంటుంది. మహారాష్ట్రలోని రత్నగిరి, సింధూదుర్గ్ జిల్లాల్లో పర్యావరణ పరంగా చాలా సమస్యలున్నాయి.
ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీలు సమర్పించిన వివరాల ఆధారంగా గోవాలో పర్యావరణ పరిస్థితులపై గాడ్గిల్ విస్తృత అధ్యయనం చేశారు. అడవుల దుర్వినియోగం, నదీ తీరంలో భూముల ఆక్రమణ, అక్రమ మైనింగ్, నిర్మాణాల వల్ల కొండచరియలు విరిగిపడి నదీ ప్రవాహాలకు ఆటంకం కలిగించి వరదలు సంభవిస్తున్నాయని తెలిపారు. నిపుణుల తమ నివేదికలో ఈ వైపరీత్యాలపై హెచ్చరించి, భూమి, నీటి వనరుల వినియోగంపై ప్రజాధారిత విధానాన్ని నొక్కిచెప్పారని స్పష్టం చేశారు.