దాదాపు పది రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమవుతోంది. రాష్ట్రం అంతా జలప్రలయాన్ని తలపిస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 14 జిల్లాలు వరదలతో అతలాకుతలమవుతున్నాయి. రాష్ట్రంలోని 44 నదులు పొంగిప్రవహిస్తుండటంతో అనేక డ్యాముల ప్రాజెక్టులను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
వరదలకు ఒక్క గురువారమే 26 మంది మృత్యువాతపడ్డారు. దీంతో ఆగస్టు 8 నుంచి ఇప్పటిదాకా వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 97కు చేరుకుంది. గురువారం సైతం భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. 14 జిల్లాల్లో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. సుమారు 1.67 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కోచితోపాటు కేరళలోని అనేక ప్రాంతాలు ముంపులో చిక్కుకున్నాయి. రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. కోచి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 26 వరకు మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.
ఇప్పటి వరకు వరదల వల్ల దాదాపు రూ.8,000 కోట్ల మేర నష్టం వాటిళ్లింది. తీవ్ర వరద పరిస్థితి ఉన్నట్టు కేంద్ర జల సంఘం తొమ్మిది వరద పర్యవేక్షణ కేంద్రాల్లోనూ నమోదైంది. ఆర్మీ, ఎయిర్ఫోర్స్, నేవీ, కోస్ట్గార్, ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 52 బెటాలియన్లు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి
మెట్రో సేవలను కూడా పూర్తిగా నిలిపివేశారు. శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ ప్రకటనతో శనివారం వరకు 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం కేరళకు చేరుకుని శనివారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.