కరోనా సమయంలో ఎక్కువగా పిల్లలు వీడియో గేమ్లకు బానిసలుగా మారిపోయారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో ప్రతి ఒక్కరు ఆన్లైన్లో గేమింగ్కి ప్రాధాన్యత ఇస్తున్నారు. గేమ్స్ ఆడటం అనేది ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండా సాధారణం అయ్యింది. ఇదొక మాయా ప్రపంచంగా మారిపోయింది. పిల్లల మనస్సులపై వీడియో గేమ్స్ ప్రభావం గురించి తల్లిదండ్రులు చాలాకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పుడు వచ్చిన ఒక కొత్త సర్వే వీడియో గేమ్స్ ఆడుకోవడం వారి అక్షరాస్యత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు మొత్తం మానసిక ప్రశాంతతను మెరుగుపరుస్తుందని చెబుతుంది. నేషనల్ లిటరసీ ట్రస్ట్ వీడియో గేమ్స్ సర్వే కోసం యుకె అంతటా 11 మరియు 16 సంవత్సరాల మధ్య 4,626 మందిని ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలు అన్నీ నవంబర్ మరియు డిసెంబర్ 2019 మధ్య కాలంలో జరిగాయి.
వీడియో గేమ్స్ ఆడే పిల్లలలో మూడవ వంతు (35.3%) మంది వీడియో గేమ్స్ తమను మంచి రీడర్లు(చదువుకునేవాళ్లు)గా చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. వీడియో గేమ్స్ ఆడేవారిలో ఎక్కువ మంది మొత్తంలో 79.4%మంది నెలకు ఒకసారి గేమింగ్కు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చదివినట్లుగా చెప్పారు. గేమ్ కమ్యూనికేషన్స్, రివ్యూస్ చదవడం వల్ల కమ్యునికేషన్ పెరిగినట్లుగా చెప్పుకొచ్చారు. అలా చదవడం వల్ల ఆటగాళ్లకు వారి రచనలను మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది. వీడియో గేమ్స్ ఆడేవారిలో 62.5% యువకులు కూడా నెలకు ఒకసారి గేమింగ్కు సంబంధించిన విషయాలను రాసినట్లు సర్వేలో చెప్పారు.