తెలుగుదేశం పార్టీలో కొన్నాళ్లుగా రాజకీయాలు థ్రిల్లర్ ను తలపిస్తున్నాయి. ఎవరి పదవి ఎప్పటివరకు ఉంటుందో.. ఏ పదవిలో ఎవరు ఉంటారో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇందుకు కారణం ఏంటంటే.. చినబాబు లోకేష్ ఆలోచనల ప్రభావమే అని కొందరు అనుమానపడుతున్నారు. తాజాగా.. మంత్రి గంటా శ్రీనివాసరావు కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలు కూడా ఇందుకు బలాన్ని కలిగిస్తున్నాయి.
విశాఖపట్నం పరిధిలో.. సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ.. వలసలను ప్రోత్సహించే దిశగా తెలుగు దేశం పార్టీ రాజకీయాలు నడుస్తున్నాయి. గంటా శ్రీనివాసరావుకు రాజకీయంగా అంతగా పడదని పేరున్న కొణతాల రామకృష్ణను పార్టీలో చేర్చేందుకు.. తెర వెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. మరోవైపు.. విశాఖకే చెందిన మరో ప్రముఖ నాయకుడు.. ఒకప్పటి జగన్ సన్నిహితుడు సబ్బం హరిని కూడా పార్టీలోకి రప్పించే దిశగా కసరత్తు మొదలైనట్టు కొందరు అనుమానిస్తున్నారు.
ఇదంతా జరిగితే.. గంటా అవుట్ అవడం ఖాయమని కూడా అంచనా వేస్తున్నారు. రాజకీయంగా ప్రాధాన్యం లేని చోట గంటా బయటికి వెళ్లిపోతే.. తమకు కొణతాల, సబ్బంతో పాటు.. రీసెంట్ గా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కళా వెంకట్రావును.. ఆ లోటుతో భర్తీ చేయొచ్చన్నది లోకేష్ బాబు ఆలోచనగా అనుమానిస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న కొందరు విశ్లేషకులు.. గంటాను బలవంతంగా బయటికి గెంటేసే పనిలో టీడీపీ ఉన్నట్టు లెక్కలేస్తున్నారు.