ఒక్క ఓటుతో ఆనాడు ప్రధాని వాజ్ పేయి అధికారాన్ని కోల్పోయారు. ఇప్పుడు ఒక్క శాతం ఓట్లతో తమిళనాడులో అధికారాన్నే కోల్పోయింది డిఎంకె. రెండు రోజుల క్రితం వచ్చిన తమిళనాడు ఫలితాల విశ్లేషణలో ఈ ఒక్కశాతం ఓట్ల విషయం వెల్లడైంది. తమిళనాట వంద నియోజకవర్గాల్లో ఒక్క శాతం ఓట్లు ఫలితాన్ని తారుమారు చేశారు.
ఇక్కడ ఒంటరిగా పోటీ చేసిన జయమ్మకు 40.8 శాతం ఓట్లు వస్తే డిఎంకె కూటమికి 39.8 శాతం ఓట్లు వచ్చాయి. డిఎంకె కూటమి నుంచి కాకుండా విడిగా పోటీ చేసిన నియోజకవర్గాల్లో మాత్రం ఆ పార్టీకి అన్నాడిఎంకె కంటే ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయి. 232 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అన్నాడిఎంకెకు 40.78 శాతం ఓట్లు వస్తే, 176 నియోజకవర్గాల్లో పోటీ చేసిన డిఎంకెకు 41.05 శాతం ఓట్లు వచ్చాయి.
అంటే డిఎంకె ఇతర పార్టీలతో చేసుకున్న ఎన్నికల ఒప్పందాన్ని అక్కడి ఓటర్లు తీవ్రంగా నిరసించారని అర్ధం చేసుకోవాలి. అందరూ కలిసి జయమ్మను సాగనంపాలనుకుంటే మొదటికే మోసం వచ్చి వారే గల్లంతు అయ్యే పరిస్ధితి వచ్చింది. దీనినే రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకోవడం అంటారు.