కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి గట్టిదెబ్బ తగిలింది. అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హరిష్ రావత్ కోర్టును ఆశ్రయించారు. రాష్ట్రపతి పాలనను ఎత్తివేయాలంటూ ఆయన కోర్టును కోరారు.
దీనిపై వాదనలు విన్న హైకోర్టు రాష్ట్రపతిపై కూడా కొన్నిసంచలన వ్యాఖ్యలు చేసింది. అనంతరం అక్కడ రాష్ట్రపతి పాలనను రద్దు చేస్తూ రావత్ సర్కారును పునరుద్ధరిస్తూ తీర్పు చెప్పింది. ఈ నెల 29 వ తేదీన హరిష్ రావత్ సభలో తన మెజార్టీ నిరూపించుకోవాలని ఆదేశించింది. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ హైకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది.
ప్రజాస్వామ్య వ్యవస్ధ మొత్తం ప్రమాదంలో ఉందని, రాష్ట్రంలో 356 సెక్షన్ విధింపు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనకు చూపిన ప్రాతిపదిక బలంగా లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. హైకోర్టు ఇచ్చిన ఈ కీలక తీర్పుపై శుక్రవారం నాడు కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.