జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండగట్టు ఘాట్రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 34మంది మృతి చెందగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 62 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు నుండి లోయలోకి పడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణీకులను రక్షించేందుకు స్థానికులు ప్రయత్నించారు.
మంగళవారం నాడు కొండగట్టు వద్ద ఆలయానికి పెద్ద ఎత్తున వస్తుంటారు. ఈ క్రమంలోనే కొండగట్టు ఘాట్ రోడ్డు నుండి కిందకు దిగుతుండగా బస్సు వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు..అదే సమయంలో బస్సు బ్రేకులు కూడ ఫెయిలైనట్టుగా చెబుతున్నారు.దీంతో బస్సు డ్రైవర్ అదుపు చేయలేకపోవడంతో బస్సు నాలుగుపల్టీలు కొట్టింది.
బస్సు నాలుగు పల్టీలు కొట్టడంతో ముందు బాగం నుజ్జునుజ్జైంది. బస్సులో ముందు భాగంలో కూర్చొన్న ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి ముందు భాగంలో కూర్చొన్నవారే ఎక్కువగా గురయ్యారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.