కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ కుమారుడు, అతడి మరదలు మృతిచెందిన హృదయ విదారకర ఘటన సోమవారం తెల్లవారుజామున కోదాడ సమీపంలో చోటుచేసుకుంది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఓ వ్యక్తికి తన తల్లి మరణించిందనే వార్త అందింది. దీంతో అతడు కన్నీరుమున్నీరవుతూ గర్భవతి అయిన తన భార్య, ఆమెకు తోడుగా ఉండటానికి వచ్చిన మరదల్ని తీసుకొని హుటాహుటిన స్వగ్రామం బయలుదేరాడు.
అంతలోకే మృత్యువు లారీ రూపంలో వెంటాడింది. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన గోవిందలక్ష్మి అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి మృతిచెందారు. ఇన్ఫోసిస్లో ఉద్యోగ రీత్యా ఆమె కుమారుడు సత్యనారాయణ (32) హైదరాబాద్లో ఉంటున్నాడు. మాతృమూర్తి ఇకలేదన్న వార్త తెలుసుకొని బోరున విలపిస్తూ హుటాహుటిన భార్య వెంకట సౌజన్య, మరదలు వెంకట మాధవితో కలిసి ఓ ప్రైవేటు క్యాబ్లో స్వగ్రామానికి బయలుదేరారు.
సౌజన్య గర్భవతి కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను విజయవాడకు తరలించారు. గాయాల పాలైన డ్రైవర్ రాజేశ్కు కోదాడలో చికిత్స అందిస్తున్నారు. కన్నతల్లి అంత్యక్రియల కోసం వెళ్తూ.. కుమారుడు కూడా అనంతలోకాలకు చేరడంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.