ఢిల్లీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ధర్నాలు.. నిరసనలతో రాజధాని హోరెత్తుతోంది. నీట్ పరీక్ష పేపర్ లీక్.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ వీధులను హోరెత్తిస్తోంది. కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఛలో సంసద్ పేరుతో సెంట్రల్ ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ హింసాత్మకంగా మారిన ఘటన మరవకముందే కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీ నివాసం ముట్టడికి ప్రయత్నించింది.
ప్రధాని మోదీ నివాసం దగ్గర కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధర్నా చేపట్టారు. నిన్న (సోమవారం) జంతర్మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్కు నిరసనగా చేపట్టిన ఈ ధర్నాలో రాహుల్తో పాటు ఖర్గే, కేసీ, ప్రియాంక, పలువురు కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. తొలుత పీఎం మోదీ నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలు పాదయాత్రగా బయలుదేరారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో రాహుల్ గాంధీ పోలీసులతో వాగ్వాదనాకి దిగాడు. పోలీసుల తీరును నిరసిస్తూ ప్రధాని ఇంటి ఎదుట బైఠాయించారు. చేతులకు సంకెళ్లు వేసుకొని నిరసన తెలిపారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గూండాగిరి, నిరంకుశత్వం వద్దంటూ.. అణచివేత చర్యలు నడవవంటూ నిరసనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో.. పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు అక్కడకు చేరుకోవటంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ధర్నా సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నిన్న యువతపై లాఠీచార్జ్కు బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ లీకేజీపై పార్లమెంట్లో చర్చకు అంగీకరించలేదని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ మౌనం వీడాలని, నీట్ అంశంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
