అత్యాచారం చేసిన నిందితులకు పోలీసులు క్లీన్ చిట్ ఇవ్వడంతో ..తీవ్ర మనస్థాపానికి గురయిన బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు కామాంధులకు బలైపోయిన బాధితురాలి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ కాళ్లరిగేలా తిరిగింది. అక్కడ కూడా న్యాయం దక్కకపోవడంతో చివరకు మరణమే శరణమనుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో చోటుచేసుకుంది.
పిల్లు, భర్తతో ఆనందంగా ఉన్న ఆమె జీవితం ఇద్దరు కామాధుల వల్ల నాశనం అయ్యింది. జిల్లాలోని కేర్నాల్ గంజ్ ప్రాంతానికి చెందిన శంకర్ దయాల్, అశోక్ ఇదే ప్రాంతానికి చెందిన ఓ వివాహితపై గతేడాది 2018, ఆగస్టులో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియోలు తీసి బెదిరించి పలు మార్లు అత్యాచారం చేస్తుండటంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనకు న్యాయం చేయాలంటూ వేడుకోంది. తనపై అత్యాచారం జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధిత వివాహిత తన భర్తతో కలిసి గత ఏడాది లక్నోలోని విధానసభ ఆఫీసు ముందు ఆత్మాహుతికి యత్నించారు. ఈ కేసును విచారించిన యూపీ పోలీసులు, క్రైం బ్రాంచ్ అధికారులు గతేడాది డిసెంబర్ లో నిందితులకు క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో మనస్తాపానికి లోనైన సదరు మహిళ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఈ ఘటనతో స్పందించిన గోండా జిల్లా ఎస్పీ ఆర్పీ సింగ్ ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసు అధికారులను సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.