అభివృద్ధి పేరుతో మనుషులు చేస్తున్న తప్పిదాలకు భారీ మూల్యం చెల్లించుకుంటున్నారు. పట్టణీకరణ, తీరప్రాంత కొరత, భారీ బిల్డింగుల నిర్మాణంతో అడవులను సర్వనాశనం చేస్తున్నారు. దీంతో ప్రకృతి విపత్తలు విలయతాండవం చేస్తున్నాయి. మొన్న జరిగి కేరళ విధ్వంసం అందరికీ తెలిసిందే. త్వరలో మరో ప్రపంచ పర్యాటక అందాల నగరం మనుమరుగు కానుందనే శాస్త్రవేత్తల మాటలు వణుకు పుట్టిస్తున్నాయి.
ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామమైన థాయ్ లాండ్ కు పెనుముప్పు పొంచి ఉందా? ఆ దేశ రాజధాని బ్యాంకాక్ త్వరలోనే సముద్రంలో మునిగిపోనుందా? అంటే శాస్త్రవేత్తలు అవుననే అంటున్నారు. ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఓ నివేదిక మరో పదేళ్లలో బ్యాంకాక్ లోని 40 శాతం భూభాగం నీటిలో మునిగిపోతుందనే సమాచారం వాతావరణ పరిస్థితుల్లోని మార్పుల తీవ్రతను తెలియజేస్తోంది.
వాతావరణ మార్పుల కారణంగా 2030 నాటికి బ్యాంకాంక్లో దాదాపు నలభై శాతం భూభాగం నీట మునిగిపోతుందట. ప్రస్తుతం బ్యాంకాక్ ఏటా ఒకటి నుంచి రెండు సెంటీమీటర్ల చొప్పున మునుగుతోంది. భవిష్యత్తులో భారీ వరద ముంపు పొంచి ఉందని గ్రీన్పీస్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్ సముద్ర తీరమట్టం ప్రపంచ సగటు కంటే ఏటా నాలుగు మిల్లీ మీటర్ల చొప్పున ఎక్కువగా పెరుగుతోంది. బ్యాంకాక్ ఇప్పటికే సముద్రమట్టం కంటే దిగువన ఉంది.
ఏడేళ్ల క్రితం రుతుపవనాల వల్ల భారీ వర్షాలు పడేసరికి బ్యాంకాక్ అయిదో వంతు భాగం నీట మునిగింది. అప్పట్లో ఒక్క బిజినెస్ డిస్ట్రిక్ట్ మాత్రం బయటపడినా మిగతా థాయ్లాండ్లో వరదలు పోటెత్తి సుమారు వందలాది మంది చనిపోయారు. అడ్డు అదుపు లేని పట్టణీకరణ, తీరప్రాంత కోత, ఆకాశహర్మ్యాల భారం తదితర వాటి వల్ల మునిగిపోవడానికి కారణంగా ఉందని అంటున్నారు. భారీ భవనాల కారణంగా బ్యాంకాక్ నెమ్మదిగా నీళ్లలో ఒరిగిపోవడానికి మరో కారణంగా చెబుతున్నారు. మరో వైపు రొయ్యల సాగు కోసం మడ అడవులను నరికేస్తుండటంతో తీర ప్రాంతంలో నేల కోత విపరీతంగా పెరిగిందని గుర్తుచేశారు.
బ్యాంకాక్ ను కాపాడుకోవాలంటే వెంటనే నగరంలో 2,600 కి.మీ మేర మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మించాలి. అంతేకాకుండా వరద నీటిని బయటకు పంపేసేందుకు 8 భూగర్భ సొరంగ మార్గాలను తవ్వాల్సి ఉంటుంది. భూయాజమాన్యంపై స్పష్టమైన విధానం ఉంటేనే దీనిని తగ్గించవచ్చునని చెబుతున్నారు. లేకుంటే భవిష్యత్తులో మరో ద్వారక నగరం బ్యాంకాక్ కానుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.