చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంటులో శిల్ప అనే జూనియర్ డాక్టర్ ఆత్మహత్య చేసుకుంది. తనను కొంత మంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ గత ఏప్రిల్ నెలలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్కు శిల్ప ఫిర్యాదు కూడా చేసింది.
శిల్పపై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ రవికుమార్పై మంగళవారం నాడు డీఎంఈ వేటు వేశారు. ఆయనను విధుల నుండి తప్పించారు. అయితే మరో ఇద్దరు ప్రోఫెసర్లపై కూడ చర్యలు తీసుకోవాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. డాక్టరు శిల్ప ఆత్మహత్య ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు.
చిత్తూరు జిల్లా పీలేరులోని డాక్టరు శిల్ప కుటుంబసభ్యులను ఈ రోజు ఆమె పరామర్శించారు. డాక్టరు శిల్ప ఆత్మహత్య టీడీపీ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. టీడీపీ పాలనలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని, సీఎంకు ఆడపిల్లలు లేరు కనుక ఆడబిడ్డల బాధలు ఆయనకు తెలియవంటూ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
శిల్ప ఆత్మహత్య ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ కేసు విచారణకు హైలెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. డీఈఎం కె. బాబ్జీ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రేపటి నుంచి విచారణ జరపనుంది.