ఎన్నికల సమయంలో వైసీపీకీ బిగ్ షాక్ తగిలింది. కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు పార్టీకీ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్కు పంపించారు. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆది శేషగిరిరావు రాజీనామా చేయడం పార్టీలో తీవ్ర చర్చనీయాశంగా మారింది. అయితే త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
రాజీనామాకు ప్రధానం కారణం వైసీపీ అధినేత జగన్ నుంచి టికెట్పై స్పష్టమైన హామీ రాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. త్వరలో జరగనున్న ఎన్నికల్లో గుంటూరు పార్టమెంట్ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన అనుకొన్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్ ఆయనను విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆదిశేషగిరిరావు వైసీపీని వీడాలని నిర్ణయించుకొన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఏ పార్టీలో చేరుతారన్న చర్చ మొదలయ్యింది. టీడీపీలో చేరుతారనే వార్తలు వస్తున్నా…జనసేనలో కూడా చేరే అవకాశాలు లేకపోలేదు. టీడీపీలో చేరినా గుంటూరు నుంచి టికెట్ దక్కే అవకాశాలు మాత్రం లేవనే చెప్పాలి. ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఆదిశేషగిరిరావుకు అల్లుడు వరుసైన గల్లా జయదేవ్ టీడీపీ నుంచి ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో దాదాపు ఆయనే మళ్లీ బరిలో దిగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గుంటూరు ఎంపీగా పోటీ చేయాలంటే జనసేన పార్టీలో మాత్రమే అవకాశం ఉంది. ఆది శేషగిరిరావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటరన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.