నంద్యాల సద్దుమనిగింది. కాకి నాడ కాక మొదలయ్యింది. నిన్నటి వరకు నంద్యాల ఉపఎన్నికపై దృష్టి పెట్టిన ప్రధానపార్టీల నేతలు ఇప్పుడు కాకినాడలో తిష్ట వేశారు. నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రచార హోరు మొదలుపెట్టారు. ఇటు టీడీపీ, అటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్ద సంఖ్యలో నేతలను తరలిస్తున్నారు. కోస్తా జిల్లాల నేతలంతా కాకినాడలోనే మకాం వేశారు.
ఏడేళ్ల విరామం తర్వాత హైకోర్టు ఆదేశాలతో కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 48 డివిజన్లకు జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించి మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని ఇరు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నువ్వా-నేనా అన్నట్టుగా ప్రచారం సాగిస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు గోదావరి జిల్లాల నాడి తెలుసుకోవడానికి కాకినాడ ఎన్నికలే కీలకం కానున్నాయి. ఇందుకోసం ఇరుపార్టీలు ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఆ క్రమంలోనే నేతల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది. కాంగ్రెస్ హయంలో భూకబ్జాలకు పాల్పడిన నేతలు ఇప్పుడు నగరాభివృద్ధిని అడ్డుకోవడానికి వస్తున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ పై కేసులున్నందున కాకినాడలో ప్రచారం చేసేందుకు అర్హత లేదని మంత్రి యనమల ఎద్దేవా చేశారు.
బీజేపీ కూడా కాకినాడలో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. టీడీపీ పొత్తులో భాగంగా 9 డివిజన్లలో బీజేపీ పోటీ చేస్తోంది. అయితే టీడీపీ రెబల్స్ తో పాటు సొంత పార్టీలో విబేధాలు కూడా బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారాయి. టీడీపీ తరుపున 10 మంది మంత్రులు, మరో 40 మంది ఎమ్మెల్యేలు కాకినాడలో ప్రచారం చేస్తున్నారు.
ఇటు వైసీపీ తరఫున విజయసాయి రెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావులు దగ్గరుండి ప్రచార బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు.జగన్కూడా ప్రచారానికి వెల్లనున్నారు. 29వ తేదీన కార్పొరేషన్ ఎన్నిక జరగనుంది. కాకినాడ కార్పొరేషణ్లో ఎవరు జెండా పాత్తారో చూడాలి.