టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటాడు. అది విపక్షాలు అయినా సొంత పార్టీ నేతలు అయినా నోటి దురుసుతో వ్యాఖ్యలు చేయడం ఆయనకు అలవాటే. తాజాగా జేసీ సీఎం చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేశారు. ఇప్పుడు ఆ సెటైర్స్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి.
చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనలో భాగంగా నిన్న రాత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ పటిష్టత, నేతల మధ్య విభేదాలు, పథకాల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. గుంతకల్, సింగనమల, కల్యాణదుర్గం, కదిరి, పుట్టపర్తి టీడీపీ ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలనను కుటుంబ సభ్యులకు అప్పగించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి కుటుంబసభ్యులను తీసుకురావాలని చూస్తున్న నేతలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీకి చెందిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులకు పెత్తనం కట్టబెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ.. పరోక్షంగా మంత్రి పరిటాల సునీతకు చురకలు అంటించారు. సర్వేల ఆధారంగానే వచ్చె ఎన్నికల్లో టికెట్లు ఉంటాయని కుండబద్దలు కొట్టారు జేసీ.
అనంతపురంలో పార్టీ గెలవాలంటే సగం మంది సిట్టింగ్ నేతలకు టికెట్లు ఇవ్వొద్దని దివాకర్ రెడ్డి సీఎంకు సూచించారు. వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ‘ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనే ఎవ్వరికీ టికెట్ ఇవ్వబోం. రేపు ప్రజా వ్యతిరేకత ఎదురైతే మీకు కూడా పార్టీ టికెట్ ఇవ్వను’ అని సుతిమెత్తగా హెచ్చరించారు.
బాబు వ్యాఖ్యలకు జేసీ కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నీతులు, సూక్తులు తమకు మాత్రమే చెబుతున్నారని.. వాటిని చంద్రబాబు ఫాలో అవుతారా అంటూ వ్యంగాస్త్రం వేశారు. తమ కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని జేసీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బాబు మాత్రం అడ్డుపడుతున్నసంగతి అందరికీ తెలిసిందే.