ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి భారీ సంఖ్యలో కరోనా టీకాలు వేయడాన్ని ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేయించిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కొవిడ్ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్ మీడియా వేదికగా చిరు అభినందించారు.
కరోనాను ఎదుర్కొనే క్రమంలో ముఖ్యమంత్రిగా మీ కృషి అందరిలో విశ్వాసాన్ని పెంచుతోందని ప్రశంసించారు. మీ నాయకత్వం స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో చిరంజీవికి సీఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వ కృషికి మీరు ఇచ్చిన కితాబుకి ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. ఇది అందరి సమిష్టి కృషి అని.. గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ప్రభుత్వ డాక్టర్లు, మండల అధికారులు, జిల్లా అధికారులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా కలెక్టర్లకు చెందుతుందని తెలిపారు.