- రసకందాయంలో తమిళ రాజకీయాలు
- గెలుపెవరిదోనని దేశవ్యాప్తంగా చర్చ
- కమల్ ప్రవేశంతో అందరికీ ఆసక్తి
తమిళనాట రాజకీయాలు ఇంకా రచ్చరచ్చగానే ఉన్నాయి. పురుచ్చతలైవి జయలలిత మరణంతో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఇంకా సమసిపోలేదు. రోజుకో మలుపు తిరుగుతూ రాజకీయాలు రసకందాయంలో ఉన్నాయి. శశికళ పార్టీ పగ్గాలు చేపట్టడం, పన్నీర్ సెల్వం తిరుగుబాటు, శశకళ జైలు పాలవడం, ఎమ్మెల్యేల గ్రూపు రాజకీయాలు, దినకరన్ తిరుగుబాటు తదితర ఘటనలు ప్రజలకు విసుగు తెప్పించేలా చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత శశికళ తన నమ్మినబంటు పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేసి జైలుకెళ్లింది. అతడు శశికళను వదిలేశాడు. చివరికి ఇప్పుడు పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఆమె కుటుంబానికి వ్యతిరేకంగా తయారయ్యారు. వీరికి కేంద్ర ఎన్నికల సంఘం ఓ తీపు కబురు అందించింది. పార్టీ రెండాకుల గుర్తు అధికార వర్గానిదేనని తేల్చి చెప్పింది. ఆ వెంటనే జయలలిత పోటీచేసిన ఆర్కే నగర్ స్థానానికి ఉప ఎన్నిక ప్రకటనను విడుదల చేసింది.
ఈ ప్రకటనతో తమిళ రాజకీయాలు హాట్హాట్గా మారాయి. ఎందుకంటే ఇప్పుడు సినీ పరిశ్రమకు చెందిన పలువురు రాజకీయంలోకి అడుగుపెట్టారు. దీంతో రాజకీయాలు ఇంకా ఆసక్తిగా మారాయి. కమల్హాసన్ ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో అన్నీ రాజకీయ పార్టీలు బరిలోకి దిగుతున్నారు. ఆర్కే నగర్ అసెంబ్లీ స్థానానికి డిసెంబర్ 21వ తేదీన పోలింగ్ జరపనున్నారు. 24వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజున ఫలితం వెల్లడించనున్నారు.
అయితే ఈ ఎన్నికలో శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్, అధికార పక్షం ఏఐడీఎంకే, ప్రధాన ప్రతిపక్షం డీఎంకే మధ్య పోటీ తీవ్రంగా ఉండనుంది. మరోవైపు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ కూడా ‘ఎంజిఆర్ అమ్మ దీపా పరవై’ పార్టీ తరఫున బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలో కనుక దినకరన్ గెలిస్తే శశికళకు పూర్వ వైభవం రావడం ఖాయం. అదే ఏఐడీఎంకే గెలిస్తే ఇక వారికి తిరుగుండదు. అయితే ఇందులో సినీనటులు రజనీకాంత్, కమల్హాసన్ మద్దతు ఎవరికిస్తారో వారి గెలుపు ఖాయంగా ఉండవచ్చు. ప్రస్తుతం వారి నిర్ణయంపై ఈ ఎన్నిక ఆధారపడింది.