ఏపీలో 2019 ఎన్నికలనాటికి రాజకీయాల్లో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఎవరు ఏపార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియని గందరగోల పరిస్థితులు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి ముందుకు నడుస్తారనే విషయమై చర్చ సాగుతోంది. ఆయన కమ్యూనిస్టులతో కలిసి వెళ్లే అవకాశాలున్నాయని కొందరు అంటుంటే, టీడీపీతోనే ఉంటారని మరికొందరు చెబుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా రాజకీయాల్లో మరో తాజా చర్చ జరుగుతోంది.
చిరంజీవి కాంగ్రెస్పార్టీకి రాజీనామా చేసి తమ్ముడు స్థాపించన జనసేన పార్టీలో చేరి కీలకబాధ్యతుల చేపట్టబోతున్నారనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెగాస్టార్, పవర్ స్టార్ లు కలసి పోటీ చేస్తారని టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలు. పవన్ మూడు రోజుల పర్యటనలో అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని తలచి భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే.
ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి, అధికారాన్ని చేజిక్కించుకోవడంలో మాత్రం విఫలమై, ఆపై పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి పదవిని, ఎంపీ పదవిని కూడా అనుభవించారు. ప్రస్తుతం సినిమాల పేరిట క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
ఇటీవలి తన ఏపీ పర్యటనలో చిరంజీవిని, ప్రజారాజ్యం పార్టీని ప్రస్తావించిన పవన్, తన అన్నను కొందరు వెన్నుపోటు పొడిచారని, వారందరూ తనకు గుర్తున్నారని, ఎవరినీ వదిలిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ నోటి వెంట వచ్చిన మాటలను విశ్లేషిస్తున్న రాజకీయ నిపుణులు, చిరంజీవి త్వరలో జనసేనలోకి వస్తారని అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో చిరంజీవి పాల్గొనేందుకు ఆసక్తి చూపట్లేదు. సినిమాలపై పూర్తిగా దృష్టి పెట్టేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున చిరంజీవి ఎంత కష్టపడినా ప్రయోజనం వుండదని తెలుసుకున్న ఆయన ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఆపై చిరంజీవి త్వరలో జనసేనలోకి వస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మెగా బ్రదర్స్ ఇద్దరూ కలుస్తారా లేదా అన్నది కొన్ని రోజుల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.