ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈనెల 11వ తేదీన టీఆర్ఎస్ కీలక భేటీ జరగనుంది. ఇప్పటికే అభ్యర్థుందరికీ ఆహ్వానాలు పంపారు. ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ భవన్లో ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులతో కేసీఆర్ సమావేశం అవుతున్నారు.
ఆదివారం మధ్యాహ్నం 4 గంటలకు అభ్యర్థులంతా అందుబాటులో ఉండాలని టీఆర్ఎస్ అధినాయకత్వం నుంచి అభ్యర్థులకు సమాచారం అందింది. 12 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుండటంతో… దానికి ఒక్క రోజు ముందుగానే అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సాయంత్రం 4 గంటల లోపే అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చే కార్యక్రమాన్ని కేసీఆర్ పూర్తి చేయనున్నట్టు సమాచారం.
ఇప్పటికే 107 మంది అభ్యర్థుల పేర్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో వారంతా ప్రచారంలో మునిగి తేలుతున్నారు. పెండింగ్లో ఉన్న 12 స్థానాల అభ్యర్థులతో పాటు ఇప్పటికే ప్రకటించిన వారికి ఆ రోజు సమావేశంలో బీ ఫారాలు అందిచనున్నారు.
మరోవైపు అభ్యర్థులను ప్రకటించని 12 స్థానాలను కూడా బీ పారాలు ఇచ్చే రోజునే ప్రకటించే అవకాశం ఉందని టీఆర్ఎస్లో చర్చ జోరుగా సాగుతోంది. అధికారికంగా 12 మంది పేర్లను ప్రకటించకపోయినా… అనధికారికంగా అభ్యర్థులకు సమాచారం ఇచ్చిన టీఆర్ఎస్… 11న వారిని కూడా అందుబాటులో ఉండాలని ఆదేశించినట్టు పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.
సమావేశంలో ఎన్నికల్లో గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించి అభ్యర్థులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. ఈనెల 12వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. అదే రోజున ఎన్నిక ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టాలని కేసీఆర్ నిర్ణయించారు.