తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఇక ఎన్నడూలేని విధంగా ఈసారి ఉదయమే పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు సినీ నటులు. అల్లు అర్జున్,చిరంజీవి,ఎన్టీఆర్,వెంకటేష్,సుమంత్తో పాటు పెద్ద ఎత్తున నటులు క్యూ లైన్లో నిలబడి ఓటు వేశారు. ఇక రాజకీయ నాయకులు సైతం ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అన్నట్లు హోరా హోరిగా సాగగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయమనే ధీమాలో బీఆర్ఎస్…ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనుండగా ఓటరు నాడి ఎలా ఉంటుందో వేచిచూడాలి.
బీఆర్ఎస్ తరపున సీఎం కేసీఆర్,కేటీఆర్,హరీశ్ ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకోగా కాంగ్రెస్ తరపున రాహుల్, ప్రియాంక,ఖర్గే, రేవంత్ ప్రచారం నిర్వహించారు. ఇక బీజేపీ తరపున ప్రధానమంత్రి నరేంద్రమోడీ,అమిత్ షాతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు ప్రచారాన్ని హోరెత్తించారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకోగా సర్వేల పేరుతో ప్రజలను సైతం గందరగోళానికి గురి చేశారు. ఇక సీఎం కేసీఆర్ స్వయంగా 96 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఏదిఏమైనా అధికారం ఎవరికి దక్కుతుందోనన్న ఉత్కంఠ మాత్రం అందరిలో నెలకొంది.