తెలంగాణలో రైతు బంధు పంపిణీకి బ్రేక్ పడింది. యాసంగి పంట కోసం రైతులకు రైతు బంధు ఇచ్చేందుకు అనుమతివ్వాలని కోరగా ఈ నెల 25న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. అయితే 25,26,27 తేదీల్లో సెలవులు కాగా 29,30 తేదీల్లో డబ్బులు జమ చేసేందుకు అనుమతివ్వలేదు. దీంతో కేవలం 28వ తేదీ ఒక్క రోజు మాత్రమే ఉండటంతో ఆ రోజు పెద్ద ఎత్తున రైతులందరి అకౌంట్లలో డబ్బులు జమ చేయాలని బీఆర్ఎస్ సర్కార్ భావించింది.
అయితే మంత్రి హరీశ్ రావు చేసిన ప్రసంగం కారణంగా రైతు బంధు పంపిణీకి బ్రేక్ వేశామని వెల్లడించింది ఈసీ. దీంతో ఇప్పుడు ఎన్నికల వార్ కాస్త రైతు బంధు వార్గా మారి బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. రైతు బంధు ఆగిపోవడానికి కాంగ్రెస్ కారణమని బీఆర్ఎస్ నేతలు మండి పడుతుంటే..రైతు బంధుతో ఓట్లను కొనుగోలు చేయాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలకు ఈసీ షాకిచ్చిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక ఇది ఓ రకంగా బీఆర్ఎస్కు దెబ్బే. ఎందుకంటే రైతు బంధు డబ్బుల పంపిణీ తర్వాత సీన్ రివర్స్ అవుతుందని బీఆర్ఎస్ నేతలు భావించగా అది పూర్తిగా బూమారాంగ్ అయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.