తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. కమ్యూనిస్టులకు కాలం చెల్లిందంటూ విమర్శలు వస్తున్న సమయంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలు అట్టహాసంగా నిర్వహించారు. దీంతో సీపీఐ తన ఉనికిని మరోసారి చాటుకుంది. వచ్చే సంవత్సరం ఎన్నికలు సమీపిస్తున్న ఈ కీలక సమయంలో సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి చాడ వెంకట్రెడ్డి రెండోసారి ఎన్నికయ్యారు. నాలుగు రోజుల పాటు జరిగిన సీపీఐ రాష్ట్ర మహాసభలు చివరి రోజు బుధవారం రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో తన సత్తా చాటాలని పార్టీ భావిస్తోంది. తమకు బలమైన నియోజకవర్గాలను గుర్తించి వాటిపై దృష్టి కేంద్రీకరించి పని చేయాలని మహాసభల్లో నిర్ణయించారు. మునుగోడు, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలోని రెండు, మూడు నియోజకవర్గాల్లో స్వతంత్రంగా బలం పెంచుకునేలా పార్టీ అధిష్టానం నిర్ణయించింది. భవిష్యత్లో కోదండరాం, వామపక్ష, ప్రజాస్వామిక, లౌకికశక్తులతో కలసి పెద్దఎత్తున ప్రజా పోరాటాలు చేయాలని తీర్మానాలు ప్రవేశపెట్టారు.
ఇది తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం
సహాయ కార్యదర్శులుగా పల్లా వెంకట్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు, కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్.బాలమల్లేశ్, పి.పద్మ, ఇ.నరసింహ, ఎం.ఆది రెడ్డి, టి.శ్రీనివాసరావు, జి.మల్లేశ్. కార్యవర్గ సభ్యులుగా మరో 33 మందిని కలుపుకొని మొత్తం 133 మందితో రాష్ట్ర కౌన్సిల్ను ఎన్నుకున్నారు.