టీడీపీ ఎంపీ సుజానా చౌదరికి ఢిల్లీ హకోర్టులో చుక్కెదురయ్యింది. అక్రమ ఆర్థిక లావాదేవుల కేసులో ఇటీవల సుజనా చౌదరికి ఈడీ( ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సుజనాకి ఎదురుదెబ్బ తగలింది. అయితే కొంత స్వల్ప ఊరట లభించింది.
ప్రస్తుతానికి సుజనాను అరెస్ట్ చేయవద్దని కోర్టు స్పష్టంచేసింది. ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడకూడదని సూచించింది. అటు డిసెంబరు 3 లోపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరుకావాలని సుజనా చౌదరిని హైకోర్టు ఆదేశించింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తనను వేధిస్తోందని సుజన హైకోర్టుకు తెలిపారు. రాజకీయంగా కక్ష సాధిస్తోందని ఆరోపించారు. కాగా..సుజనా చౌదరి రూ.5,700 కోట్ల మేరకు బ్యాంకులను మోసగించారని ఈడీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
కొద్దిరోజుల కిందట హైదరాబాద్లోని సుజనా నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఈడీ.. కీలక డాక్యుమెంట్లతో పాటు 6 ఖరీదైన కార్లను సీజ్ చేసింది. సుజనా గ్రూప్ కంపెనీలు బ్యాంకులకు రూ.5,700 కోట్లు పైగా ఎగవేసాయని ఈడీ తెలిపింది. సుజనాచౌదరి 120కిపైగా డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి కోట్లు కొల్లగొట్టారని.. ఆయన సంస్థల్లో పనిచేస్తున్నఉద్యోగులను డైరెక్టర్లుగా పెట్టి షెల్ కంపెనీలు ప్రారంభించినట్లు సుజనా చౌదరిపై ఆరోపణలున్నాయి. ఈ కేసుకు సంబంధించి నవంబరు 27న విచారణకు హాజరుకావాల్సిందిగా సుజనాకు ఈడీ సమన్లు పంపింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు.