ఇప్పటివరకు ఏ ఒక్క నియోజకవర్గంలోనూ రెండు సార్లు పోటీచేయని గంటా శ్రీనివాసరావు ఈ సారి ఆ రికార్డును బ్రేక్ చేస్తారనుకున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలా జరిగేలా కనిపించడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబుకు గంటా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నట్టు సమాచారం.
2009లో అనకాపల్లి ఎంపీగా పనిచేసిన గంటా 2014లో భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి భీమిలి నియోజకవర్గం టికెట్ను అవంతి శ్రీనివాస్ కోరినా కూడా గంటా అందుకు అంగీకరించలేదు. చివరకు అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. ఇక గంటాకు లైన్ క్లియర్ అయింది. ఆయన భీమిలి నుంచే పోటీ చేస్తారు అనుకునే సమయంలో.. తాను ఇప్పుడు భీమిలి నుంచి పోటీ చేయనని చెబుతున్నారట గంటా. విశాఖ ఎంపీ సీటు కావాలంటూ చంద్రబాబు ముందు ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే విశాఖ ఎంపీ సీటు నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్కు కేటాయిస్తారని టీడీపీ నేతల మాట. ఈ భరత్.. మాజీ ఎంపి, గీతం విద్యాసంస్ధల వ్యవస్ధాపకుడు ఎంవివిఎస్ మూర్తి మనవడు. ఆయనకు బాలయ్య, చినబాబు లోకేశ్ హామీ ఇచ్చారని చర్చ.
ఇదంతా తెలిసి కూడా గంటా విశాఖ ఎంపీ టికెట్ కోసం గంటా ప్రయత్నించడం ఏంటనేది కొత్త చర్చ. అయితే అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీలో చేరడంతో భీమిలిలో ఆయనను ఎదుర్కోవడం కష్టమన్న భయంతోనే గంటా ఇప్పుడీ ప్లాను మార్చినట్లు చెబుతున్నారు. మొత్తానికి గంటా గంటకో మాట మాట్లాడుతూ చంద్రబాబుకు పెద్ద తలనొప్పిలా తయారయ్యారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.