ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును హైకోర్టు బుధవారం మరోసారి విచారించింది. విచారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విమానాశ్రయం లాంజ్ లో శ్రీనివాస్ అనేవ్యక్తి జగన్మోహన్రెడ్డిపై కత్తితో దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ కేసును కేంద్రానికి తెలియజేయకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. తాజాగా వైఎస్ జగన్పై హత్యాయత్నం ఘటనలో కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 14లోపు ఎన్ఐఏకి కేసును బదిలీ చేయాలా? వద్దా ? అనే దానిపై నిర్ణయం తీసుకోవాలని, ఎన్ఐఏ కేసు దర్యాప్తు చేసి ఉంటే నివేదికను సీల్డ్ కవర్లో ఇవ్వాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే కేంద్రానికి రిపోర్టు ఇచ్చామని సీఐఎస్ఎఫ్ పేర్కొంది.
జగన్పై దాడి కేసును బుధవారం మరోసారి విచారించిన ధర్మాసనం ముందు ఏపీ సర్కారు తరపున అడ్వకేట్ జనరల్ తన వాదనలు వినిపించారు. ఈ కేసుకు సెక్షన్ 3 వర్తించదని, వ్యక్తిగత దాడిగా పరిగణించి రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేపడుతుందన్న అడ్వకేట్ జనరల్ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించ లేదు.ఏపీ ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది.