ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఇప్పుడు కొత్త తలనొప్పి పట్టుకుంది. ఇప్పటికే అనేక రాష్ట్ర, జాతీయ సమస్యలతో సతమతమవుతున్న చంద్రబాబుకు ఫిరాయింపు ఎమ్మెల్యేలు కొత్త తలనొప్పిగా మారారు. ఊపులో దొరికినవారిని కొనేసిన చంద్రబాబు.. క్షమించాలి.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి .. అసలు పాలన అంటే చంద్రబాబు చేసేదే అని ఆయన చేత పచ్చ కండువా కప్పించుకున్న నేతలు.. ఇప్పుడు ఆయనకు పెద్ద తలనొప్పిగా మారారు. ఆ సమయంలో స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా వారిని పార్టీలోకి అయితే తీసుకున్నారు కానీ… ఎన్నికలు వచ్చేసరికే ఇప్పుడు అదే పెద్ద సమస్యగా తయారైంది.
ఎంతో కాలం నుంచి పార్టీ కోసం పనిచేసని వారికి టికెట్ కేటాయించాలా? లేక పార్టీ ఫిరాయించిన నేతకు మళ్లీ టికెట్ కేటాయించాలా? అని మదనపడుతున్నారు ప్రస్తుతం చంద్రబాబు. ప్రస్తుతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గంలో. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన రామసుబ్బారెడ్డి… వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో జమ్మలమడుగులో ఎవరు పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి.. ఈ ఇద్దరికీ జమ్మలమడుగులో గట్టి పట్టు ఉంది. వీరిద్దరు టికెట్ నాకంటే నాకంటూ బయటికి కనిపించని ఓ యుద్ధం చేస్తున్నారు. అయితే వీరిద్దరిలో ఒకరిని కడప ఎంపీ సీటుకు పోటీ చేయించాలని చంద్రబాబు భావించారట. కానీ ఆ ఇద్దరు నేతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. తమకు జమ్మలమడుగు స్థానమే కావాలంటూ పడుతున్నారు. ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో ఇప్పుడు తెలుగుతమ్ముళ్లలో కొత్త కలవరం మొదలైంది.
ఇక ఈ విషయంలో తానే పంచాయతీ చెబుతానని చంద్రబాబు రంగంలోకి దిగారు. వారిద్దరిని రాజధానికి పిలుపించుకున్నారు. రామసుబ్బారెడ్డి, ఆది నారాయణ రెడ్డిల్లో ఎవరు కడప ఎంపీ సీటుకు పోటీ చేస్తే వారికి ముందుగానే ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెడతానని ఆఫర్ ఇచ్చారట. ఎంపీగా ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి ఉండనే ఉంటుంది. ఇక రెండో వారు జమ్మలమడుగు అసెంబ్లీ సీటుకు పోటీ చేయాలనేది చంద్రబాబు పెట్టిన షరతు. దీంతో వివాదాన్ని పక్కన పెట్టి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం.