కొద్దిరోజుల కిందట పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లకు మరొకటి కలిపేసి.. నాలుగు పెళ్లిళ్లంటూ జగన్ చేసిన వ్యక్తిగత కామెంట్లను చేశారు. ఏకంగా కార్లను మార్చేసినట్టు భార్యలను మార్చే వ్యక్తి అంటూ.. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ను ఏ రాజకీయ నాయకుడు అనడానికి భయపడిన మాటలను జగన్ అనేశారు. దీంతో ఈ మాటలు పవన్ కళ్యాణ్ను సైతం చాలా ఇబ్బంది పెట్టాయి. ఈ మాటలు విన్నవింటనే ఒకింత ఆవేశంతో పవన్ స్పందించి.. ఘాటుగానే సమాధానం ఇచ్చారు. కానీ.. తర్వాత పవన్ చూపిన పరిణతి, ఆలోచనా తీరుతో వివాదం పెద్దదవ్వకుండా.. ఒకే మాటతో కట్టడి చేయగలిగారు. లేదంటే అప్పటికే.. వైసీపీ నుంచి ఫైర్బ్రాండ్లు రంగంలోనికి దిగిపోయి.. రచ్చ రచ్చ చేసేందుకు సన్నద్ధమయ్యారు. ఇదే సమయంలో అటు జనసేన అభిమాన సైన్యం కూడా కత్తులు దూస్తూ.. తమ అధినేతను అంత మాట అంటారా.. అంటూ నోటికి పనిచెప్పడం ప్రారంభించారు. కొందరు యూట్యూబ్, ఫేస్బుక్లలో లైవ్లు ఇస్తూ.. జగన్ను ఉతికి ఆరేసే పనిని చేపట్టారు కూడా. మూడు పెళ్లిల్లే కదా చేసుకున్నది.. నాలుగోది ఎక్కడి నుంచొచ్చిందంటూ పరష పదజాలంతో జగన్పై దాడి చేశారు.
పవన్ కళ్యాణ్ వివాదాన్ని పెద్దదవ్వకుండా ఉండేందుకు చేసిన ఒకే ఒక్క ప్రకటన సత్ఫలితమిచ్చింది. పవన్ కళ్యాణ్ తన శ్రేణులకు ఒక ఆదేశం ఇచ్చారు. నా వ్యక్తిగత విషయాలను జగన్ లేవనెత్తి విమర్శించారని.. మీరు అతని ఇంటి ఆడవాళ్ల గురించి ఎలాంటి విమర్శలు చేయొద్దంటూ పవన్ సూచించారు. అంతే.. ఆ ఒక్క మాటతో జన సైన్యం ఎక్కడికక్కడ కట్టడి అయిపోయింది. అది పవన్ చెప్పిన ఆదేశమని కాదు.. అవతలి వాళ్లు కూడా మహిళలే కదా.. అలా చేయకూడదనే ఆలోచన వారిలో రావడమే కారణం. ఈ ఒక్క మాటతో అటు జగన్ పార్టీ శ్రేణులను సైతం పవన్ కట్టడి చేయగలిగారు. ఈ విషయాన్ని తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ తన పార్టీ వీర మహిళా విభాగం సమావేశంలోనూ మరోసారి ప్రస్తావించారు. తనను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శించినా.. తిట్టినా పట్టించుకోను. జగన్ ఈ మధ్య నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. నేనూ అదే స్థాయిలో మాట్లాడొచ్చు. కానీ జగన్ ఇంట్లోని ఆడపడుచులు, తల్లీబిడ్డలు బాధపడితే అది నన్ను బాధిస్తుంది. అందుకే వాళ్లు గుర్తొచ్చి.. వారెంత బాధపడతారో గ్రహించి.. మాట్లాడలేదంటూ పవన్ పేర్కొన్నారు. పవన్ చెప్పిన ఈ మాటలు విన్నాక.. జగన్ కూడా ఖచ్చితంగా మరోసారి అవతలి వారి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే.. ఒకటికి పదిసార్లు ఆలోచనలో పడాల్సిందే.
ప్రస్తుత రాజకీయాల్లో ఇలా ఒక్క మాటతో అవతల వారిని కట్టడి చేయడం అనేది ఈ మధ్యకాలంలో చూడలేదు. ఒకటి తిడితే.. రెండు తిట్టడం.. మళ్లీ వాళ్లు మూడంటే.. ఇటునుంచి ఐదనడం.. చివరికి అదో జాతి సమస్యగా మార్చి.. ప్రజలందరినీ కొట్టుకు చావాలన్నట్టుగా నేటి రాజకీయ నాయకుల పంథా ఉంటోంది. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు పరిణతితో ఆలోచించి అడుగేయడం వల్ల మిగతా వారిలోనూ మార్పు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఇటీవల ఓ తెలుగు సినిమాలో చెప్పిన డైలాగ్ ఈ సందర్భంగా గుర్తు చేయాలనిపిస్తోంది.. ఈ పగలు ఆగాలంటే ఒకవైపు ఆపితే.. రెండో వైపు అలసిపోయి ఆగుతారనుకున్నాను. కానీ.. అలసిపోతే కాదు.. మనుషులు మారితేనే ఆగుతాయనేది నువ్వు నిరూపించావంటూ.. హీరోతో తండ్రి అంటాడు. ఇది అక్షరాలా నిజం రాజకీయమైనా.. ఇంకేదైనా అవతలి వారిని ఆలోచనలో పడేయగలిగితే.. సమస్య ఒక్క దెబ్బతో ముగిసిపోతుంది. ఇక్కడ పవన్ అదే చేశారు.