తన నియేజక వర్గ ప్రజలకోసం ఇప్పటివరకు ఏంచేయలేదని అందుకే ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాని ప్రకటించి సంచలనాలకు తెరలేపారు. వెంటనే సీఎం చంద్రబాబు రంగంలోకి దిగడంతో జేసీ చల్లబడ్డారు. అయితే ఇప్పుడు మరో కొత్త ట్విష్ట్ తెరపైకి రావడంతో టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు.
చాగల్లు రిజర్వాయర్కు నీరు ఇవ్వకుంటే రాజీనామా చేస్తానంటూ గురువారం తెలిపారు. వెంటనే బాబు రంగంలోకి దిగారు. మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఆ శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు.. అనంతలోని సీఈ జలంధర్, హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావులతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే చాగల్లుకి నీటిని విడుదల చేశారు. దీంతో తన పంతం నెగ్గించుకున్నారు జేసీ.
శింగనమల నియోజకవర్గంలో ఆయకట్టుకు, చెరువులకు నీటి కేటాయింపు ఉండటంతో తమకు నీటిని విడుదల చేయాలంటూ శింగనమల నాయకులు కోరారు. వారి అభ్యర్థనను అధికారులు పక్కనపెట్టారని అంటున్నారు. ఇంతలో జేసీ దివాకర్ రెడ్డి హఠాత్తుగా రాజీనామా అంశాన్ని మరోసారి తెరపైకి తెచ్చారు. దీంతో వెంటనె చాగల్లు రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు.
చాగల్లుకు నీటిని విడుదల చేయడంతో శింగనమల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రుసరుసలాడుతున్నారు. తమను పక్కనపెట్టి, చాగల్లుకు నీటిని ఎలా ఇస్తారంటూ శింగనమల నాయకులు నిలదీస్తున్నారని తెలుస్తోంది.
ఇప్పుడు తెరపైకి మరో కొత్త వాదన తెచ్చారు జేసీ . తుంగబధ్ర జలాల్లో వాటా కూడా ఇవ్వాలని జేసీ దివాకర్ రెడ్డి మెలిక పెట్టారు. చాగల్లు రిజర్వాయర్కు నీటి విడుదలపై మాటలు మాత్రమే వద్దని, తుంగభద్ర జలాల్లో వాటా లేదని, అందులో వాటా ఇస్తూ జీవో ఇవ్వాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు జైసీ సూటిగా చెప్పారని తెలుస్తోంది. జీవో ఇవ్వకుంటే రాజీనామాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని తెలుస్తోంది. మరి చంద్రబాబు వీరి తగాదాను ఎలా తీరుస్తారొ చూడాలి.