ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 21వ తేదీ వరకు ఆయన మీడియాతో మాట్లాడొద్దన్న SEC ఆదేశాలను ధర్మాసనం తప్పుబట్టింది. కొడాలి నాని మీడియాతో మాట్లాడొచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇవాళ ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే SECపై, ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేసింది. ఇలా ఉండగా, ఈ నెల 12వ తేదీన తాడేపల్లి వైసీపీ ఆఫీస్లో ప్రెస్మీట్ పెట్టి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును తప్పుబట్టారు కొడాలి నాని.
ఆ తర్వాత గంటలోనే ఆయనకు షోకాజ్ నోటీసు జారీ అయింది. డెడ్లైన్ కంటే ముందే కొడాలి నాని వివరణ ఇచ్చారు. కాగా, నిన్న జరిగిన విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపిస్తూ.. ‘ఎన్నికల నిర్వహణ విషయంలోనే ఎన్నికల కమిషనర్కు విస్తృత అధికారాలు ఉంటాయి గానీ, వాక్ స్వాతంత్య్రాన్ని హరించేలా ఉత్తర్వులివ్వడానికి వీల్లేదు’ అన్నారు.
ఎస్ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ.. ‘మంత్రిగా ఉన్న వ్యక్తి రాజ్యాంగ సంస్థ అయిన ఎస్ఈసీని గౌరవించాలి. మంత్రి వ్యాఖ్యలు ప్రజల్లో ఎస్ఈసీ అసమర్థులనే భావన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మీడియాతో మాట్లాడకుండా మంత్రిని నిలువరించాల్సి వచ్చింది’ అని తెలిపారు.
వామన్రావు హత్య కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్.. ఆందోళనకు దిగిన అడ్వకేట్లు..!