ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జగన్ను మరో సారి దెబ్బ కొట్టేందుకు సిద్దమవుతున్నారు. అది కూడా జగన్ కు కంచుకోట అయిన కడప జిల్లాలో. నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో విజయం సాధించి వైసీపీకి షాక్ ఇచ్చిది టీడీపీ. ఇప్పుడు మరోసారి ఝలక్ ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు చంద్రబాబు.
కోర్టుల కేసుల కారణంగా కడప జిల్లా రాజంపేట మునిసిపాలిటీకి ఎన్నికలు వాయిదా పడుతు వస్తున్నాయి. తొలుత కోర్టులో ఉన్న కేసులను తొలగించి, ఆపై ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారు బాబు. రాజంపేట మున్సిపాలిటీని గెలుచుకొని జగన్కు ప్రజాభిమానం తగ్గిందని నిరూపించాలని ఉవ్వీల్లూరుతున్నారు.
ఇంటింటికి తెలుగు దేశం కార్యక్రమం ద్వారా రాజంపేటపై ప్రత్యేక దృష్టిపెట్టింది అధికార పార్టీ. అక్కడి స్థానిక నాయకత్వాన్ని ఎన్నికలకు సిద్దంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే రాజంపేట మునిసిపల్ అధికారులకు రహదారులు, డ్రైనేజీ కాలువలు, ఎల్ఈడీ వీధి దీపాలు వంటి పనులతో పాటు, పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాకినాడలో ఫలించిన అభివృద్ధి మంత్రమే ఇక్కడా పని చేస్తుందని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇక తెలుగుదేశం ఎత్తుగడల గురించి తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ క్యాడర్ ను అప్రమత్తం చేసింది. స్థానిక పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి స్వయంగా ‘వైఎస్ఆర్ కుటుంబం’ పేరిట ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్లీనరీలో జగన్ ఇచ్చిన నవరత్నాల హామీలను వివరిస్తూ, కరపత్రాలు పంచుతున్నారు. దీంతో ఇప్పుడే రాజంపేటలో ఎన్నికల సందడి కనిపిస్తోంది.
రాజంపేట మున్సిపాలిటి ఎన్నికలు త్వరలో ఉంటాయన్ననేపథ్యంలో ఇరు పార్టీలు ప్రచారం ముమ్మరం చేశారు. వైకాపాకు పెట్టని కంచుకోటగా చెప్పుకునే కడప జిల్లాలో జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తమ పట్టును కొనసాగించాలని తెలుగుదేశం, ఎలాగైనా నిలుపుకొని పూర్వ వైభవం సాధించాలని వైకాపా గట్టిగా ప్రయత్నిస్తోంది.